బిగ్ బాస్ విన్నర్.. ఇప్పటికి బిజీ అవుతోంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఆశించిన స్థాయిలో సక్సెస్, అవకాశాలు ఉండవని అందరూ చెబుతూ ఉంటారు. ఏ రేంజ్ లో గ్లామర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్న మన దర్శకులు మాత్రం తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయరని ఈ తరం యంగ్ బ్యూటీస్ అందరూ చేసే విమర్శ. ఇందులో వాస్తవం ఉందని చెప్పాలి. తెలుగు హీరోయిన్స్ ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు.

అలాంటి వారిలో ఆవకాయబిర్యాని సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అందాల భామ బిందుమాధవి ఒకరు. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బంపర్ ఆఫర్ అనే సినిమాతో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఆ మూవీ తర్వాత తెలుగులో ఒకటి, రెండు సినిమాలు చేసిన కూడా కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం ఈ బ్యూటీ సక్సెస్ కాలేదు. తరువాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి అక్కడ మాత్రం అవకాశాలు వరుస పెట్టి వచ్చాయి. దీంతో తమిళ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యింది. ఇక చాలా కాలం తర్వాత తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ నాట్ స్టాప్ షోలో పాల్గొంది.

ఇందులో టైటిల్ విన్నర్ అయిన తర్వాత తెలుగు నుంచి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. సినిమాలలో ఛాన్స్ లు రావడం లేదు కాని డిజిటల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం మాత్రం బిందుమాధవికి వచ్చింది. రీసెంట్ గా యాంగర్ టేల్స్ అనే వెబ్ సిరీస్ లో ఈ బ్యూటీ నటించింది. అందులో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇప్పుడు నవదీప్ తో కలిసి న్యూసెన్స్ అనే మరో వెబ్ సిరీస్ తో ఆహాలో ఎంటర్టైన్ చేయబోతుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయితే మాత్రం తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే తెలుగులో మంచి సినిమాతో మరల వెండితెరపై అలరించాలని బిందుమాధవి భావిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన మూడు తమిళ్ మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ మూడింటిలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఆమె నటిస్తూ ఉండటం విశేషం.