ఈ సారి బిగ్ బాస్ సరి కొత్తగా…!

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో మరో సరికొత్త సీజన్ తో మన ముందుకు రావడానికి రెడీ అవుతోంది. పలు రంగాల్లో ప్రముఖులైన కొందరిని ఒకే ఇంట్లో ఉంచి, బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసి, వారికి కొన్ని టాస్క్ లు ఇచ్చి ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. గత ఐదు సీజన్లు బాగానే ఆకట్టుకున్నా, ఆరో సీజన్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సీజన్ చాలా చప్పగా సాగిందని నెటిజన్లు విపరీతంగా విమర్శలు చేశారు.

ఏ సీజన్ కీ లేనంత దారుణంగా రేటింగ్ పడిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఏడో సీజన్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. దీంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది. అయితే, గత సీజన్ లో జరిగిన పొరపాట్లు కారణంగా నెటిజన్లు కేవలం బిగ్ బాస్ టీమ్ ని మాత్రమే కాకుండా, హోస్ట్ నాగార్జునను సైతం విపరీతంగా ట్రోల్ చేశారు.

దీంతో, ఈ విషయంలో నాగార్జున సైతం బిగ్ బాస్ టీమ్ పై సీరియస్ అయ్యారట. దీంతో, ఈ సారి టీమ్ మరింత జాగ్రత్తగా, ఎలాంటి పొరపాట్లు జరకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఈ సారి సరికొత్త కండిషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ లో ముందుగా వెళ్లిన కంటెస్టెంట్స్ తో పాటు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది. కానీ, ఈ సారి మాత్రం అలా వైల్డ్ కార్డు అనే కాన్సెప్ట్ లేకుండా చేస్తున్నారట.

అంతేకాకుండా, టాస్క్ లు గతంలోవి రిపీట్ కాకుండా, ఈ సారి కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఇక, ఈ సీజన్ లో చాలా మంది ఇంట్రస్టింగ్ పర్సన్స్ ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈటీవీ ప్రభాకర్, యూట్యూబ్ ఫేమ్ యాంకర్ నిఖిల్, సింగర్ మోహన భోగరాజు, ఢీ కొరియోగ్రాఫర్ పండు, టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు ఆయన భార్య కూడా వస్తున్నారట. మరి కొందరి పేర్లు కూడా వినపడుతున్నాయి.

షో మొదలైతే తప్ప, ఎవరెవరు వస్తారు అనే విషయం తేలనుంది. ఇక, బిగ్ బాస్ ఓటీటీలో సందడి చేసిన కొందరు సైతం మళ్లీ ఈ బిగ్ బాస్ 7లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీజన్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రసారం అయ్యే అవకాశం ఉంది.