ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. నిమ్మకూరులో ఎన్టీఆర్ కి నివాళులర్పించిన బాలకృష్ణ..!

నందమూరి తారక రామారావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా,ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు,ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. తన తండ్రి శత జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ నిమ్మకూరులో సందడి చేశారు.

నందమూరి తారకరామారావు జన్మస్థలమైన నిమ్మకూరులో బాలకృష్ణ తన తండ్రికి నివాళులు అర్పించాడు. ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు కారణంగా నిమ్మకూరుకి వచ్చిన బాలకృష్ణ మొదట అక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఎన్టీఆర్ శత జయంతి కారణంగా నిమ్మకూరులో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలలో బాలకృష్ణ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా వివిధ దేశాలలో ఉన్న తెలుగువారందరి గుండెల్లోను ఎన్టీఆర్ గారు చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఎన్టీఆర్ జన్మించిన ఈ స్థలాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని తమ శ్రేయోభిలాషులు సన్నిహితులు నిర్ణయించుకున్నట్టు ఈ సందర్భంగా బాలకృష్ణ తెలియజేశాడు. అంతేకాకుండా తన నాయనమ్మ గుర్తుగా నిమ్మకూరులో ఉన్న డాబాని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశాడు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఒక ఆరాధ్య దైవమని, అటువంటి వ్యక్తికి కొడుకుగా జన్మించినందుకు ఎంతో అదృష్టవంతుడిని అంటూ బాలకృష్ణ గారు చెప్పుకొచ్చారు. స్వర్గీయులు అయిన ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు ప్రజలందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ బాలకృష్ణ తెలియజేశాడు.