ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశలకు చెపాక్ మైదానమే బ్రేక్ వేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన హోం మ్యాచ్లో మరో ఓటమిని చవిచూసిన సీఎస్కే, ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. చెన్నైకి ఇది వరుసగా ఐదో హోం ఓటమి కావడం గమనార్హం. పంజాబ్ మాత్రం ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.2 ఓవర్లలో 190 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం సామ్ కరన్ (88; 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లు) మాత్రమే పోరాడగా, బ్రెవిస్ (32) కొంత మెరుగ్గా ఆడాడు. మిగిలిన బ్యాటర్లు మాత్రం నిస్సహాయంగా వెనుదిరిగారు. చివర్లో చాహల్ మాయాజాలం సీనియర్లను కూడా మటాష్ చేసింది. ఒక్క ఓవర్లో ధోనీ (11), హుడా (2), కాంబోజ్ (0), నూర్ అహ్మద్ (0)లను పెవిలియన్కు పంపి హ్యాట్రిక్ అందుకున్నాడు. అర్ష్దీప్, యాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
లక్ష్యచేధనలో పంజాబ్ ఆరంభం బలంగా కనిపించింది. శ్రేయస్ అయ్యర్ (72; 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (54; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించడంతో చెన్నైపై ఒత్తిడి పెరిగింది. 12 ఓవర్లకే 120 పరుగులు చేసిన పంజాబ్, ఇక మ్యాచ్ను అద్భుతంగా కంట్రోల్ చేసింది. మధ్యలో వికెట్లు కోల్పోయినప్పటికీ అవసరమైన స్కోరును 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది.
చెన్నై బౌలింగ్లో పతిరన, ఖలీల్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. జడేజా, నూర్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. అయితే ముఖ్యమైన సమయంలో వికెట్లు తీయడంలో విఫలమవడంతో మ్యాచ్ చెన్నై చేతి నుంచి జారిపోయింది.
ఇప్పటి వరకు 10 మ్యాచ్లలో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించిన సీఎస్కే, 8వ ఓటమితో పాయింట్ల పట్టిక చివరిలో నిలిచింది. ఇక పంజాబ్ మాత్రం 13 పాయింట్లతో టాప్ 2లోకి ప్రవేశించి తమ ప్లేఆఫ్స్ అవకాశాలను బలపరిచింది. మిగిలిన మ్యాచ్లలో గెలిస్తే పంజాబ్కు నేరుగా టాప్ 2లో చోటు దక్కే అవకాశం ఉంది.