కేన్స్‌లో బాలీవుడ్‌ సందడి.. ఉత్తమనటిగా అనసూయ సేన్‌గుప్తాకు అవార్డు

ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన డ్రెస్‌లను ధరించి రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోతున్నారు. మరోవైపు ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో మలయాళీ చిత్రం ‘ఆల్‌ వీ ఇమాజైన్‌ యాజ్‌ లైట్‌’ పోటీలో నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పోటీలో నిలవడం విశేషం. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోని ముఖ్య విభాగమైన ‘పామ్‌ డి ఓర్‌’ అవార్డుల కేటగిరీలో ఈ సినిమా పోటీ పడుతున్నది.

ఇదిలావుంటే తాజాగా భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. ఇందులో మరో ముఖ్య విభాగమైన ‘అన్‌ స్టెరాయిన్ రిగార్డ్‌’కేటగిరీలో ఉత్తమ నటిగా అనసూయ అవార్డు అందుకుంది. ‘ది షేమ్‌లెస్‌ అనే చిత్రానికి ఆమె ఈ అవార్డు అందుకోగా.. ఈ ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫెస్టివల్‌లో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించింది.

ఇక ‘ది షేమ్‌లెస్‌ ’ చిత్ర విషయానికి వస్తే.. ఈ సినిమాను బల్గేరియన్‌ దర్శకుడు కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అనసూయ రేణుక అనే వేశ్య పాత్ర ను పోషించింది. దేశ రాజధాని ఢిల్లీలో గల ఓ బ్రోతల్‌ హౌస్‌లో ఉన్న రేణుక అనుకోకుండా అక్కడకు వచ్చిన పోలీసును చంపి పారిపోతుంది. ఇక అక్కడ నుంచి దూరంగా పారిపోయిన రేణుక ఒక సెక్స్‌ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడనే ఒక అమ్మాయితో ప్రేమలో పడుతుంది. ఈ క్రమంలోనే వారికి ఎదురైన అడ్డంకులు ఏంటి. చివరికి ఎం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.