ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్కు గాయాలవగా.. ప్రస్తుతం శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా బుధవారం ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్లు అరవింద్తో కలిసి కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ను పరామర్శించారు. కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రేవతి కుటుంబానికి పుష్ప టీం రూ.2 కోట్లు పరిహారం ప్రకటించింది. అల్లు అర్జున్ రూ.కోటి, సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ప్రకటించగా.. పరిహారం చెక్కులను అల్లు అరవింద్ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. ఈ మేరకు అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి శ్రీతేజ్ కుటుంబసభ్యులకు నేడు చెక్కు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీతేజ్ కుటుంబానికి మా తరపున మొత్తం రూ.2 కోట్ల పరిహారం అందజేస్తున్నామని.. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని అల్లు అరవింద్ అన్నారు. శ్రీతేజ్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటున్నాడని ఆశిస్తున్నామన్నారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ..శ్రీతేజ్ త్వరగా కోలుకుంటున్నాడని. పరిహారం సొమ్ము సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.