సినిమాలకు సౌత్‌..నార్త్‌ తేడా లేదన్న బన్నీ!

మేమంతా ఒకటే.. మేము మేము బాగానే ఉంటాం. మీరు కూడా కలిసికట్టుగా ఉండాలని తరచూ స్టార్‌ హీరోలు ఫ్యాన్స్‌కు హితబోధ చేస్తుంటారు. పరిశ్రమలో హీరోల మధ్య పోటీ ఉన్నా లేకున్నా సోషల్‌ మీడియాలో ఫాన్స్‌ మధ్య వార్‌, లేదా సౌత్‌ ఇండస్టీ వర్సెస్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీ అని ఎప్పుడూ వాదన జరుగుతూనే ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలపై హీరోలు కూడా స్పందించారు. కళకు భాష, ప్రాంతాల తేడా ఉండదని చెబుతుంటారు.

తాజాగా ఓ షోలో పాల్గొన్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. ఆరు దశాబ్థాల బాలీవుడ్‌ మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం హిట్‌ రేట్‌ తగ్గిందని పరిశ్రమను విమర్శించడం సరికాదు. దక్షిణాది, ఉత్తరాది అన్న తేడా లేదు. రెండూ సోదర భావంతో గౌరవించుకుంటున్నాయి. సౌత్‌ సినిమాల ప్రభావం నార్త్‌ పై ఉన్నట్లు అక్కడి సినిమాల ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది. అంతే కానీ సౌత్‌, నార్త్‌ అని భేదం లేదు. మంచి సినిమా ఏ భాషలో విడుదల చేసినా ఆడుతుందని అల్లు అర్జున్‌ తెలిపారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రధారులు. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.