నాగచైతన్య – నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం.. వివరాలు వెల్లడించిన నాగార్జున

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య -నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను నటుడు నాగార్జున సోషల్‌విూడియాలో పంచుకున్నారు. నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని విూ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం.

నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది అని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. నాగచైతన్యకు గతంలో నటి సమంతతో పెళ్లయ్యాక కొంతకాలానికి వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. చై-శోభిత ఎంతోకాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.