మంచు లక్ష్మి ఫాంటసీ మూవీ ‘ఆదిపర్వం’

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మల్టీ లింగ్యుల్‌ ఫిలిం ‘ఆదిపర్వం’ చిత్రానికి సంజీవ్‌ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్‌ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్‌, ఎ.ఐ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్‌ విడుదల చేశారు. తెలంగాణ ఎఫ్‌.డి.సి ఛైర్మన్‌ ఎన్‌. గిరిధర్‌ చేతుల మీదుగా ‘ఆదిపర్వం’ తెలుగు ట్రైలర్‌ విడుదలైంది.

జడ్చర్ల ఎమ్మెల్యే జె అనిరుధ్‌ రెడ్డి తమిళ ట్రైలర్‌, ప్రముఖ దర్శకులు నీలకంఠ కన్నడ ట్రైలర్‌, ప్రముఖ రియల్టర్‌ శిల్పా ప్రతాప్‌ రెడ్డి మలయాళ ట్రైలర్‌, చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వర్‌ రావు హిందీ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌, బిల్డర్‌ కైపా ప్రతాప్‌ రెడ్డి, నటీనటులు ఢిల్లీ రాజేశ్వరి, సత్య ప్రకాష్‌, శివ కంఠమనేని, వెంకట్‌ కిరణ్‌, జెమినీ సురేష్‌, ఆదిత్య ఓం, శ్రీజిత ఘోష్‌, సీనియర్‌ జర్నలిస్టులు ప్రభు, ఆర్‌.డి.ఎస్‌ ప్రకాష్‌, సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.ఎస్‌. హరీష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత ఘంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అతిధులంతా సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

లక్ష్మీ మంచు మాట్లాడుతూ.. ‘నాకు సంజీవ్‌ గారు కథ చెప్పినప్పుడు ఇంత పెద్ద సినిమా తక్కువ సమయంలో ఎలా చేస్తారని అనుకున్నా. పోస్టర్‌ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్లు చేశానా అనిపిస్తుంది. నవ రసాలు, అన్ని రకాల ఎమోషన్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మా దర్శకుడు చాలా స్వీట్‌ పర్సన్‌. మా నిర్మాతలు కోరుకున్న దాని కంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుతున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓ అభిమాని మంచు లక్ష్మికి పాదాభివందనం చేయగా.. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు మంచు లక్ష్మిని గజమాలతో సత్కరించారు.

దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ.. ‘మంచు లక్ష్మీ గారి ద్వారా మీరు స్టార్‌ డైరెక్టర్‌ కాబోతున్నారని ‘ఆదిపర్వం’ పోస్టర్‌ చూసి చాలామంది చెప్పారని అది నాకు చాలా సంతోషంగా అనిపించిందని, అవార్డు వచ్చినంత ఆనందం వేసిందన్నారు. ఈ మూవీలో మంచు లక్ష్మీ విశ్వరూపం చూస్తామని.. ఆదిత్య ఓంని కొత్త పాత్రలో చూస్తారన్నారు. ఎస్తర్‌ కీలక పాత్ర చేశారన్నారు. శ్రీజిత ఘోష్‌ వద్దని 99 మంది చెబితే నేను ఒక్కడినే ఆ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పా అని ఆమె 1000 శాతం న్యాయం చేసిందన్నారు. క్షేత్ర పాలకుడిగా శివ కంఠమనేని, లక్ష్మీ మంచుభర్త పాత్రలో జెమిని సురేష్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌ వెంకట్‌ కిరణ్‌ చక్కని నటన కనబరిచారన్నారు. మొత్తంగా ఈ సినిమాలో సుమారు 400 మంది నటించారన్నారు. ఈ సినిమాకు బలం, బలగం మంచు లక్ష్మీ (ఓజీనిఞఠబీ ఒజీబఠపతి) గారని, దాదాపు 7 గెటప్స్‌ వేసిందన్నారు. దాదాపు 50 అడుగుల ఎత్తులో షూట్స్‌ చేశారని, ఆవిడ లేకపోతే ఈ మూవీ లేదని. ఈ మూవీకి ఇంత ప్రాముఖ్యం వచ్చేది కాదని ఇది ఆరంభం మాత్రమే’ అని అన్నారు.