27న విడుదలకు సిద్దంగా ‘దేవర’.. చిత్ర ప్రమోషన్‌లలో తారలు బిజీ

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ’దేవర’ (Devara Movie) భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ నేడు విడుదల కానుంది. ఇది రిలీజ్‌ కావడానికి ముందే ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్‌తో మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. దీంతో నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ’దేవర’ నిలిచింది.

ట్రైలర్‌ కూడా రిలీజ్‌ కాకముందే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దీంతో ఎన్టీఆర్‌ (NTR) అభిమానులు సంబరపడుతున్నారు. ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక ఈ సంఖ్య మరింత పెరిగి మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశముందని అనుకుంటున్నారు. ముంబయిలో ’దేవర’ ప్రమోషన్స్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌లు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.