రామ్ చరణ్ కు వినూత్న కానుకను అందజేసిన అభిమాని. ఇంటికి పిలిపించిన చరణ్!

సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో పట్ల ఉన్న ప్రేమను వివిధ రూపాలలో తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో లక్షల మంది అభిమానులు ఉన్న చరణ్ కి గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతానికి చెందిన జైరాజ్ ఒకరు. ఈయనకు తల్లి తండ్రి ఇద్దరూ కూడా లేకపోవడంతో అనాథగా ఉన్న జై రాజ్ రామ్ చరణ్ కు పెద్ద అభిమాని.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రతి పుట్టిన రోజుకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏకంగా తన ప్రాంతంలో పొలం లీజుకు తీసుకొని మూడు నెలల పాటు శ్రమించి రామ్ చరణ్ ముఖ కవళికలతో వరి నాట్లు పండించారు. ఈ విధంగా వరితో రామ్ చరణ్ చిత్రపటాన్ని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రామ్ చరణ్ కోసం జైరాజ్ పాదయాత్ర కూడా చేశారు. తన దగ్గర డబ్బు లేకపోయినా ఇతరులు చేసిన సహాయంతో తాను రామ్ చరణ్ పై ఉన్న అభిమానంతో ఇలా వరితో చిత్రపటాలు గీశారని తెలియజేశారు.

ఇలా తనకోసం వినూత్న పద్ధతిలో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమాని జై రాజ్ ని రామ్ చరణ్ ఇంటికి పిలిపించి సుమారు 45 నిమిషాల పాటు తనతో మాట్లాడిన అనంతరం తనకు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని అదేవిధంగా కొంతమేర ఆర్థిక సహాయం కూడా చేశారు. ఈ క్రమంలోనే జై రాజ్ మాట్లాడుతూ ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న రామ్ చరణ్ గారికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను అంటూ తెలియజేశారు.