అమిషాకు రజనీకాంత్ ఘాటు కౌంటర్

అమిత్ షాకు కౌంటర్ ఇచ్చిన రజనీకాంత్

కొద్ది రోజుల ముందు శనివారం అమిత్ షా హిందీ భాషా దినోత్సవం సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఇలా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘భారత్ లాంటి దేశంలో విభిన్నమైన భాషలు ఉన్నాయి. ప్రతి భాషకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ, అందరికీ ఒకే భాష అనేది తప్పక ఉండాలి. అప్పుడే విశ్వవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు వస్తుంది. ఒకభాషే ఉంటే అందరిలో ఐకమత్యం అలవడుతుంది. అదీ హిందీ భాషే అయి ఉండాలి. ఎందుకంటే భారత్ మొత్తంలో చాలా మంది ఈ భాషనే అర్థం చేసుకోగలరు’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై పలువురి నుంచి వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. తమిళ నటుడు కమల్ హాసన్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లు వ్యతిరేకించారు.

భాషా వ్యాఖ్యలపై తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. తమ గుర్తింపును, భాష, సంస్కృతి పరిరక్షణ కోసం ఎందాకైనా వెళతామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభిమాని, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వివాదంపై స్పందించారు.

చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశం మొత్తానికి ఒకే భాష అనేది భారతదేశానికే కాదు ఏ దేశానికైనా మంచిదే. ఇది అభివృద్ధికి ఐక్యతకు దోహదపడుతుంది. దురదృష్టవశాత్తు ఒకే భాష అనేది ఒక వ్యక్తి చెప్తే రాదు. అందుకని ఏ భాషను మాపై రుద్దకండి’ అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

‘ప్రత్యేకంగా హిందీని రుద్దాలనుకుంటే తమిళనాడు మాత్రమే కాదు ఏ దక్షిణాది రాష్ట్రం దీనికి ఒప్పుకోదు. అంతేకాదు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా దీనికి వ్యతిరేకత వ్యక్తం చేస్తాయి’ అని చెన్నై ఎయిర్‌పోర్ట్ దగ్గర మీడియా మిత్రులతో తమిళంలో మాట్లాడారు రజనీకాంత్. అని కుండబద్ధలు కొట్టారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి షాలను రజనీకాంత్ కృష్ణార్జునులుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.