‘నాయకుడు’ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుంది: ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి స్టాలిన్ పొలిటికల్, యాక్షన్ డ్రామా ‘మామన్నన్’. రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే తమిళనాట విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ‘నాయకుడు’ పేరుతో విడుదల చేస్తున్నాయి. రేపు (జులై 14) నాయకుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఉదయనిధి స్టాలిన్ మీడియా సమవేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మామన్నన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు ముందుగా అభినందనలు? తెలుగులో సినిమాను విడుదల చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది?
థాంక్స్. మేము దీన్ని మల్టీ లాంగ్వేజస్ కోసం రూపొందించాలని ప్లాన్ చేయలేదు. తమిళంలో ఓ సినిమా చేయాలనుకున్నాం. తెలుగులో నా గత చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నాం. ఈ చిత్రం తమిళంలో మంచి వసూళ్లను సాధించడంతో పాటు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్‌ ను అందుకుంది. తెలుగు హక్కుల కోసం మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని భావించాం.

కథ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నారా?
ఇది చాలా మంచి కథ . సమాజంలో సామాజిక న్యాయం, ప్రజల మధ్య సమానత్వం గురించి ఇందులో చర్చించాం. ఇది పొలిటికల్ డ్రామా. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను.

తమిళంలో ఈ సినిమా సాధించిన విజయం తెలుగు వెర్షన్‌కి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారా?
ఈ రోజుల్లో సోషల్ మీడియా కారణంగా, సినిమా అభిమానులందరికీ అన్ని భాషల కంటెంట్ గురించి బాగా తెలుసు. ఒక భాషలో పాజిటివ్ టాక్ వస్తే ఇతర భాషల సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ సినిమా డబ్బింగ్ కోసం తెలుగు నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న ఏషియన్ , సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది.

ఈ సినిమా చేయడానికి మిమ్మల్నిఆకర్షించిన అంశం ఏమిటి?
కథ విన్న వెంటనే చాలా ఆసక్తి కలిగింది. నా గత చిత్రాలన్నీ కామెడీ, డ్రామా అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు. నేను జాలీ ఎల్‌ఎల్‌బికి రీమేక్‌ గా 7 సంవత్సరాల క్రితం మణితన్ అనే సినిమా చేశాను. అది పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ కామెడీ సినిమా చేయాలనుకున్నాను. కానీ ఈ కథతో మరి సెల్వరాజ్ నన్ను అబ్బురపరిచారు. నటనకు చాలా స్కోప్ ఉన్న సినిమా చేయడం నిజంగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమాలో సోషల్ మెసేజ్ కూడా బాగా నచ్చింది. మారి సెల్వరాజ్ గత సినిమాలు కూడా నేను ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం. ఆయన చిత్రాలు సామాజిక అన్యాయాన్ని చర్చిస్తాయి.

దీన్ని మీ చివరి సినిమాగా ఎందుకు ఎంచుకున్నారు?
కమల్‌హాసన్‌ గారి ప్రొడక్షన్‌ బ్యానర్‌లో నేను ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సమయంలో సినిమాల నుంచి తప్పుకునే ఆలోచన లేదు. కర్మన్ విడుదలయ్యాక మారి సెల్వరాజ్‌కి ఫోన్ చేసి ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నానని చెప్పాను. తనకు చాలా కమిట్‌మెంట్లు ఉన్నాయని చెప్పారు. నేను సినిమాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, నా చివరి సినిమాని బలమైన కథతో మారితో చేయాలనుకున్నాను.

వడివేలు తమిళంలో లెజెండరీ కమెడియన్. కానీ డిఫరెంట్ పాత్రలో కనిపించారు. అతనితో పని చేయడం ఎలా అనిపించింది?
నేను మిస్టర్ సూర్య ఆధవన్‌లో అతిధి పాత్రలో నటించాను. అప్పుడు వడివేలు సర్‌తో సమయం గడపడానికి, పని చేయడానికి ప్రయత్నించాను. నవ్వించే పాత్ర అది. మారి సెల్వరాజ్ మామన్నన్ కథ చెప్పినప్పుడు, సినిమాలో తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పాను. మరుసటి రోజు తనని పిలిచి, తండ్రి పాత్రకు సరైన ఎంపిక ఎవరు అని మీరు అనుకుంటున్నారు? అని అడిగాను. వడివేలు అని చెప్పారు. అది విని నిజంగా షాక్ అయ్యాను. పూర్తిగా డిఫరెంట్ జానర్‌లో ఈ పాత్రని ఆయన చేస్తారా అనే ఓ చిన్న సందేహం కూడా వచ్చింది. వడివేలు సర్‌కి ఫోన్ చేసి నా చివరి సినిమా చేయమని రిక్వెస్ట్ చేశాను. ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ వంటి నటీనటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.

ఆల్ ది వెరీ బెస్ట్
థాంక్స్