బిడ్డ మెద‌డు చురుకుగా ప‌నిచెయ్యాలంటే…?

గ‌ర్భంలో ఉన్న బిడ్డ‌కు ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ కుండా చాలా జాగ్ర‌త్త‌లు ఆరోగ్య నియ‌మాలు పాటిస్తుంది. ఎక్కువ‌గా బిడ్డ పై ప్ర‌భావం ప‌డేది మ‌న ఆహార లోపాల వ‌ల్ల‌నే. ఎక్క‌వ‌గా మ‌నం తీసుకునే ఆహారం ప్రభావం గర్భం దాల్చిన తర్వాత బిడ్డ మెదడు ఎదుగుదల మీద ఉంటుందని తాజా పరిశోధనల ద్వారా వెల్లడైందని పరిశోధకులు అంటున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆహార పరిశోధక సంస్థకు తమ తాజా పరిశోధనల వివరాలను అందజేస్తూ బిడ్డ మెదడు ఎదుగుదల మీద ఆహారం ప్రభావం గురించి వారు వివరించారు.

ఒక మహిళ గర్భం దాల్చడానికి ఎంతో ముందు నుంచి, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర పోషకాలు సమపాళ్లలో తీసుకుంటూ ఉంటే గర్భం దాల్చిన సమయంలో బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుందనీ, ప్రసవం తర్వాత కూడా బిడ్డ ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వారన్నారు.ఇలా కాకుండా పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటూ గర్భం దాల్చితే, పిల్లలు పుడుతూనే సెరెబ్రల్‌ పాల్సీ, ఆటిజం లాంటి రుగ్మతలను వెంట తెచ్చుకోవడంతోపాటు, పిల్లలు నెలలు నిండకుండా పుట్టే ప్రమాదం కూడా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఒమేగా 3, ఒమేగా 6… ఈ రెండు ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయితే మన దేశంలో ఒమేగా6 ఫ్యాటీ యాసిడ్ల పరిమాణం పెరుగుతూ, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్ల పరిమాణం తరుగుతోంది. దీని వల్ల తేలికగా ఇన్‌ఫ్లమేషన్స్‌కు గురవడం, తక్కువ తెలివితేటలు మొదలైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

ఇలా జరగకుండా ఉండాలంటే ఆహారంలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ల నిష్పత్తి 1:5 గా ఉండాలని పరిశోధకులు చెప్పారు. విదేశాలతో పోలిస్తే మన దేశంలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్‌ వాడకం ఎక్కువ. మన ఆహారశైలి అలాంటిది కావడంతో ఒమేగా 6 ఎక్కువగా, ఒమేగా 3 తక్కువగా తీసుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటి అలవాటు వల్ల ఒమేగా 6 శరీరంలో ఎక్కువగా చేరిపోయి, అంతో ఇంతో ఆహారం ద్వారా అందిన ఒమేగా 3 శరీరంలో శోషణ జరగకుండా మిగిలిపోతోంది.