వాట్సప్ లలో ‘లీక్ వీడియో’ హల్ చల్..వర్మ పనే?

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే చాలా క్రేజ్ వచ్చింది. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌పై స్టే ఇవ్వాలంటూ టీడీపీ ఈసీని ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో సినిమాలోని కీలకమైన వైస్రాయ్‌ హోటల్‌ సీన్‌లో సోషల్‌ మీడియాలో లీకైందంటూ దుమారం రేగింది. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను దాచిన వైస్రాయ్‌ హోటల్‌ ముందు చైతన్య రథంపై ఎన్టీఆర్‌ ప్రసంగించటంలో ఆయనపై ప్రత్యర్థులు చెప్పులతో దాడి చేయటం, దీంతో ఎన్టీఆర్.. అంతా కలిసి నన్ను చంపేశారు అంటూ బాధపడటం లాంటి అంశాలు ఈ లీకైన వీడియోలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వాట్సప్ లలో ఎక్కుడ చూసినా ఈ వీడియోనే కనపడుతోంది. అయితేఈ వీడియో లీక్ వెనక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడంటున్నారు. కావాలనే ఆయన ఈ సీన్ ని సినిమాపై క్రేజ్ క్రియేట్ చేయటం కోసం లీక్ చేసాడని చెప్పుకుంటున్నారు. దానికి తోడు లీక్ అయినా వర్మ ఏ మాత్రం స్పందించకపోవటం అనేక సందేహాలు కలిగిస్తోంది.

రామ్‌ గోపాల్‌ వర్మ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అగస్త్య మంజు మరో దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా యగ్నా శెట్టి లక్ష్మీ పార్వతిగా కనిపించనున్నారు. శ్రీతేజ్‌ చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. కల్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.