ఆర్దిక సమస్యలతో నాగ్‌ సినిమా ఆగిపోయిందా..?

సినిమాలు సగం షూటింగ్ జరిగాక ఆర్దిక సమస్యలు రావటం , ప్రాజెక్టులు ముందుకు వెళ్లక పైనాన్స్ ల కోసం పరుగెత్తటం, ఆగిపోవటం సర్వసామాన్యం. అయితే అవన్నీ పెద్ద సినిమాలకు వర్తించవు. స్టార్ హీరోలు నటించే సినిమాలకు ఆర్దిక సమస్యలు సాధారణంగా తలెత్తవు. ఎందుకంటే ఆ సినిమాలపై డబ్బు పెట్టడానికి చాలా మంది రెడీగా ఉంటారు. కానీ ఒక్కోసారి ఎంత పెద్ద బ్యానర్ అయినా, ఎంత స్టార్ హీరో ఉన్నా పరిస్దితి వాళ్ల చేతిలో ఉండక, ప్రాజెక్టులు ఆపేయాల్సిన పరిస్దితి వస్తుంది. ఇప్పుడు నాగార్జున కమిటైన మల్టిస్టారర్ ది అదే పరిస్దితి అని తెలుస్తోంది.

రీసెంట్ గా దేవదాసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా కమిటవ్వలేదు. బాలీవుడ్‌లో చిత్రం బ్రహ్మాస్త్ర లో గెస్ట్ క్యారక్టర్ చేస్తున్న ఆయన షూటింగ్‌ పూర్తి చేసిన నాగ్‌, తమిళంలో మరో మల్టీస్టారర్‌కు ఓకె చెప్పాడు. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ తో ఓ భారీ మల్టీస్టారర్‌ కమిటయ్యాడు. ఆ సినిమాకు డెరెక్టర్ ధనుష్.

మొదట ఈ మల్టీస్టారర్‌లో రజనీకాంత్‌ను నటింప చేసేందుకు ప్రయత్నాలు జరిగినా కుదరలేదు. దాంతో ఆ స్థానంలో నాగార్జునను తీసుకున్నారు. పూజ కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా ఇంత వరకు షూటింగ్ మొదలు కాలేదు. ధనుష్‌ మారి 2 రిలీజ్‌ తరువాత మల్టీస్టారర్‌ పనులు ప్రారంభిస్తారని అంతా భావించారు. అయితే మారి 2 రిలీజ్‌ అయిన వెంటనే ధనుష్‌ , అసురన్‌ అనే మరో సినిమాను ఎనౌన్స్‌ చేసేసి ఆ బిజీలో పడిపోయాడు. అసురన్‌ షూటింగ్ జనవరిలోనే ప్రారంభం కానుంది.

ఈ నేఫద్యంలో ధనుష్‌ డైరెక్ట్ చేయబోయే మల్టీస్టారర్‌ ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయటానికి ముందుకొచ్చిన తేనాండల్‌ మూవీస్‌ సంస్ద ఆర్థిక సమస్యలే ఈ ప్రాజెక్ట్‌ ను పక్కకు పెట్టడానికి ఓ కారణం అని తెలుస్తోంది.