రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం దహనం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ ఘటన వెనుక రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లేందుకు ఓ ప్రజాప్రతినిధే కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, దేవలంపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బొమ్మాయపల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ గోవిందయ్యను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడే మంగళవారం వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం… ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే, పోలీసుల లోతైన విచారణలో ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా తేలింది. విగ్రహానికి సమీపంలో ఉన్న ఓ పూరి గుడిసెకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా, ఆ మంటలు ప్రమాదవశాత్తు విగ్రహానికి వ్యాపించాయి.
పశువులకు కూడా హాస్టల్ సౌకర్యం: ఏపీలో మూగజీవాల సంరక్షణకు చంద్రబాబు వినూత్న ప్రణాళిక
అక్రమ కట్టడాలు, లేఔట్లు నిర్మిస్తే కూల్చివేత తప్పదు: మంత్రి నారాయణ
ఈ ప్రమాదాన్ని ఆసరాగా తీసుకున్న సర్పంచ్ గోవిందయ్య, స్థానిక టీడీపీ నాయకులను ఇరికించేందుకు కుట్ర పన్నారు. గుడిసె యజమానురాలితో కలిసి, ఉద్దేశపూర్వకంగానే ఎవరో విగ్రహానికి నిప్పు పెట్టారంటూ ఒక నాటకాన్ని సృష్టించి, తప్పుడు ప్రచారం చేశారు.
ఈ ప్రచారం కారణంగా దళిత సంఘాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, దేవలంపేట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దర్యాప్తు అనంతరం, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం సర్పంచ్ గోవిందయ్య సృష్టించిన వివాదమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని ఎస్పీ తుషార్ డూడే నిర్ధారించారు. గోవిందయ్యను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొందరిపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

