MLC Anantha Babu: మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (Anantha Babu) వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై కొత్తగా కేసు నమోదు కావడంతో, అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు ఆయన దొరకకుండా పరారయ్యారు. మంగళవారం రాత్రి కాకినాడలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
అసలేం జరిగిందంటే..?
దళిత యువకుడు, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రస్తుతం అనంతబాబు సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్పై బయట ఉన్నారు. అయితే, ఈ కేసులో కోర్టు విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో సాక్షులను ప్రభావితం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, లేనిపక్షంలో ప్రాణహాని తలపెడతామని అనంతబాబు తమను బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సాక్ష్యం మార్చడానికి డబ్బు ఆశ చూపడమే కాకుండా, తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు అనంతబాబుతో పాటు ఆయన అనుచరులపై కొత్తగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అనుచరుడు మాగంటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాక్షుల ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి కాకినాడలోని ఎమ్మెల్సీ అపార్ట్మెంట్కు సుమారు 20 మందికి పైగా పోలీసులు చేరుకున్నారు. పోలీసుల వాహనాలను చూసిన అనంతబాబు, తన కారును, గన్మెన్లను అక్కడే వదిలేసి.. పోలీసుల కళ్లు గప్పి మోటార్సైకిల్పై పరారైనట్లు సమాచారం. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు హెచ్చరిక సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ ఇచ్చే సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాక్షులను ప్రభావితం చేసినా, దర్యాప్తును అడ్డుకున్నా బెయిల్ రద్దు చేస్తామని గతంలోనే హెచ్చరించింది. తాజాగా ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఈ హత్య కేసులో అభియోగాల నమోదు (Framing of Charges) జరగాల్సి ఉంది. ఈ క్రమంలో సాక్షులను బెదిరించడం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

