YS Sharmila: ఆటో డ్రైవర్లను చంద్రబాబు ఘోరంగా మోసం చేశారు: షర్మిల ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ప్రస్తుత అమలుకు మధ్య పొంతన లేదని, ఇది డ్రైవర్లను ఘోరంగా మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని డ్రైవర్ సోదరులకు మసిపూసి మారేడుకాయ చేశారని ఆమె మండిపడ్డారు.

“చంద్రబాబుగారి హామీలు బారెడు.. వాటి అమలు మాత్రం మూరెడు. ఏ పథకం అమలు చేసినా సగం సగమే. అన్నింటా కోతలే. నేడు ఆటో డ్రైవర్ అన్నలకు చంద్రబాబు గారు చేసింది ఘరానా మోసం” అని షర్మిల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఎన్నికల్లో ప్రసంగాలకు, అమలు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో రూ. 15 వేల పథకానికి పొంతనే లేదని ఆమె విమర్శించారు. ఖాకీ చొక్కాలు వేసుకుని, ఆటోల్లో తిరిగినట్లు ఫొటోలకు పోజులిచ్చి, వారి కుటుంబాలను ఉద్ధరించినట్లు కాకమ్మ కబుర్లు చెప్పి డ్రైవర్ అన్నలకు మసి పూసి మారేడుకాయ చేశారని ఆమె ధ్వజమెత్తారు.

ఆటో డ్రైవర్లను మోసగించడంలో గత వైసీపీ ప్రభుత్వానికి, నేటి కూటమి ప్రభుత్వానికి తేడా లేదని, ఇద్దరూ దొందూ దొందేనని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బ్యాడ్జి కలిగిన ప్రతి డ్రైవర్‌కి ఏటా రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం 2.90 లక్షల మందికే ఎలా ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్‌టీఏ లెక్కల ప్రకారం సుమారు 15 లక్షల మంది బ్యాడ్జి కలిగిన డ్రైవర్లు ఉంటే, కూటమి ప్రభుత్వం కూడా కేవలం 10 శాతం మందికే ఈ పథకాన్ని ఎందుకు వర్తింపజేసిందని ప్రశ్నించారు. ఓనర్ కం డ్రైవర్ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారని, ఆటో తోలుకొని బ్రతికే వారిని ఎందుకు విస్మరించారని, పథకంలో కోత పెట్టేందుకు 18 నిబంధనలు ఎందుకు పెట్టారని ఆమె నిలదీశారు. గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కేవలం 30 వేల మందికి అదనంగా ఇచ్చి 13 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఉద్ధరించినట్లా? అని షర్మిల ప్రశ్నించారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన షర్మిల ఈ క్రింది డిమాండ్లు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 13 లక్షల మంది డ్రైవర్లకు పథకాన్ని వర్తింపజేయాలి. అందరికి రూ. 15 వేల చొప్పున అకౌంట్లలో వేయాలి. ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ వెహికల్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్‌కి కూడా రూ. 15 వేలు ఇవ్వాలి. అన్ని వర్గాల డ్రైవర్లతో కూడిన సాధికార సంస్థను ఏర్పాటు చేయాలి.

Advocate Pepakayala Ramakrishna Reveals Some Facts Of YS Rajasekhara Reddy Accident | Telugu Rajyam