YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కేవలం సమీక్షలు నిర్వహిస్తే సరిపోదని ఆమె మండిపడ్డారు. ఇంధన సరఫరాను పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వానికి ఆమె 24 గంటల డెడ్ లైన్ విధించారు.
“దేశంలో ఎక్కడా లేని ఇంధన కొరత కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఏర్పడింది? దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ప్రజలను ఎర్రటి ఎండలో కిలోమీటర్ల మేర బంకుల ముందు నిలబెట్టడం కూటమి పాలనా వైఫల్యానికి నిదర్శనం,” అని షర్మిల విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 శాతం బంకులు మూతపడటం అత్యంత దారుణమని, ఇది రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ వంటి పరిస్థితులను సూచిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మోదీకి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టినా, రాష్ట్రానికి కనీసం పెట్రోల్, డీజిల్ తెచ్చుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని ఎద్దేవా చేశారు.

షర్మిల ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు. సమీక్షల పేరుతో కాలయాపన చేయకుండా, యుద్ధ ప్రాతిపదికన ఇంధన నిల్వలను రప్పించాలి. దీనిని ఒక విపత్తుగా గుర్తించి, తక్షణమే సరఫరాను పునరుద్ధరించాలి. ఇంధన కొరత వల్ల రవాణా వ్యవస్థ స్తంభించి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలని ఆమె హెచ్చరించారు.
“ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం తమాషాగా చూస్తోంది. 24 గంటల్లోగా ఇంధన కష్టాలు తీరకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం,” అని షర్మిల హెచ్చరించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఇంధన కొరత అంశం మరింత వేడెక్కింది.

