YS Sharmila: జగన్ ‘మావిగన్ జోకర్’.. వైఎస్సార్ ఆశయాలను తుంగలో తొక్కారు: వైఎస్ షర్మిల ధ్వజం

YS Sharmila: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి, సొంతానికి ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్.. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’గా మిగిలిపోయారంటూ ఎద్దేవా చేశారు. జగన్ కేవలం వైఎస్సార్ పేరును వాడుకున్నారే తప్ప, ఆయన ఆశయాలకు వారసుడు కాలేకపోయారని విమర్శించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను మార్చేసిందని గుర్తుచేశారు. ఆనాటి పాదయాత్రే కాంగ్రెస్‌ను రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి తెచ్చిందని, నేటి అభివృద్ధికి అదే నిర్వచనమని కొనియాడారు.

వైఎస్సార్ ఐడియాలజీ గురించి మాట్లాడే జగన్, ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆశయాలను ఎందుకు నెరవేర్చలేదని షర్మిల నిలదీశారు. వైఎస్సార్ కలల ప్రాజెక్టు అయిన జలయజ్ఞాన్ని జగన్ ఎందుకు పూర్తి చేయలేదు? ‘మాట తప్పం మడమ తిప్పం’ అని చెప్పి, సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని గాలికి వదిలేసి, ‘ఓన్లీ క్యాష్’ మాఫియాతో కల్తీ మద్యం ఎందుకు అమ్ముతున్నారు?. వైఎస్సార్ జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా ఎలా మారారు? దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు?.

వైఎస్సార్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్సార్
వైఎస్సార్ హయాంలోనే సంక్షేమానికి అసలైన అర్థం లభించిందని షర్మిల గుర్తుచేశారు. ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రజల కన్నీళ్ల నుంచి పుట్టినవని అన్నారు.

“వైఎస్సార్ ఐడియాలజీ బతికి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే. ఆయన ఆశయాల సాధన మళ్లీ కాంగ్రెస్‌తోనే సాధ్యం. వైఎస్సార్ అభిమానులందరూ హస్తంతో జతకట్టి, ఆనాటి సంక్షేమ పాలనను మళ్లీ తెచ్చుకుందాం.” అని ఆమె పిలుపునిచ్చారు.

చివరగా, వైఎస్సార్ అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటేనే వైఎస్సార్ అని ఆమె పునరుద్ఘాటించారు.

Maoists Warns Central Govt, Tension In Amit Shah | Telugu Rajyam