Sharmila – Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. తమ కుటుంబ ఆస్తుల వివాదంపై సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె అత్యంత ఘాటుగా స్పందించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు ఆస్తుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
“నేను ఆస్తుల కోసం పాకులాడుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నా ఉద్దేశ్యం ఆస్తులే అయితే తెలంగాణలో కాకుండా ఆంధ్రాలోనే పార్టీ పెట్టేదాన్ని” అని షర్మిల స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో నిజాలు మాట్లాడుతున్నందుకే తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా మరణించినప్పుడు ‘సాక్షి’ మీడియా ఏడు గంటల పాటు గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేసిందో చెప్పే ధైర్యం జగన్కు కానీ, భారతీ రెడ్డికి కానీ ఉందా? అని ఆమె నిలదీశారు.
తమ తల్లి వైఎస్ విజయమ్మ విడుదల చేసిన లేఖపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని షర్మిల తిప్పికొట్టారు. “ఆ లేఖలోని ప్రతి అక్షరం నిజం. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ప్రకారం పిల్లలందరికీ ఆస్తులు సమానంగా పంచాలని ఆమె చెప్పారు. అది తల్లిగా ఆమె ఆవేదన.” “లేఖపై సంతకం విజయమ్మది కాదని అబద్ధాలు ప్రచారం చేయడం మానేసి, దమ్ముంటే జగనే నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. లేదా తన తల్లితోనైనా నిజం చెప్పించాలి” అని షర్మిల సవాల్ విసిరారు.

ఈ వివాదం పూర్తిగా వ్యక్తిగతమని, దీనిలోకి పార్టీ నేతలను ఎందుకు లాగుతున్నారని ఆమె ప్రశ్నించారు. జగన్ తన వెనుక ఉన్న ‘సైతాన్ సైన్యం’తో తనపై విమర్శలు చేయిస్తున్నారని, అది ఆయన బలహీనతకు నిదర్శనమని విమర్శించారు. “రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మోదీకి దత్తపుత్రుడిగా మారింది జగనే” అని ఆమె ఎద్దేవా చేశారు.
జగన్ తన తల్లిపైనే కోర్టులో కేసు వేయడం వల్లే తాము చేసుకున్న ఎంఓయూ పత్రాలు బయటకు వచ్చాయని షర్మిల వివరించారు. ఆస్తుల కంటే రాజశేఖర్ రెడ్డి గారి విలువలు, ఆశయాలే తమకు ముఖ్యమని ఆమె పునరుద్ఘాటించారు. జగన్ దర్శకత్వంలోనే ఈ మొత్తం నాటకం నడుస్తోందని, నిజం వైపు నిలబడే ధైర్యం లేకే ఇతరుల వెనుక దాక్కుంటున్నారని షర్మిల తన ప్రసంగాన్ని ముగించారు.

