టీఎస్పీఎస్సీ పేపర్ కావాలా… అడ్వాన్స్ – మొత్తం ఇంత!

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సిట్ విచారణలో రోజు రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తీగను లాగితే డొంకంతా కదిలిన చందంగా తవ్వే కొద్దే సంచలన విషయాలు బయటకువస్తూనేవున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ ఖండాలు దాటిందని తెలిసిన అనంతరం… లోకల్ విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా.. టీఎస్పీఎస్సీ పేపర్ కావాలంటే మొత్తం ఎంత చెల్లించాలి.. ముందుగా అడ్వాన్స్ ఎంత చెల్లించాలి అనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే ఈ వ్యవహారంలో వరుసపెట్టి అరెస్టులు చేస్తున్న సిట్ అధికారులు తాజాగా షాద్ నగర్ పరిధిలోని నేరేళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుల సంఖ్య 14కు చేరింది. ఈ సందర్భంగా రాజేంద్రకుమార్ ద్వారా… ఈ ప్రశ్నాపత్రాల ధర వెలుగులోకి వచ్చింది. అవును.. లీకేజ్ మెయిన్ క్యాండిడేట్స్ తో ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ.10 లక్షలకు ఒప్పందం కుదిరిందని రాజేంద్రకుమార్ సిట్ అధికారులకు తెలిపరంట. ఇందులో భగంగా ముందు 5లక్షలు చెల్లించినట్లు కూడా రాజేంద్రకుమార్ ఒప్పుకున్నారట.

కాగా… ఏ-1 ప్రవీణ్, ఏ-2 రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేశ్, సురేశ్ లను సిట్ అధికారులు ఆరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్స్ స్వాదీనం చేసుకున్నారు అధికారులు. పైన పేర్కొన్న ఆ ముగ్గురిలో గ్రూప్-1లో 127 మార్కులు వచ్చిన షమీమ్ అనే నిందితుడు, 122 మార్కులు సాధించిన మరో నిందితుడు రమేశ్ సహా సురేశ్ అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకి తరలించారు సిట్ అధికారులు.

రమేశ్, సురేశ్, షమీమ్ ఏప్రిల్ 6 వరకు రిమాండ్ లో ఉండనున్నారు. టీఎస్పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా రమేశ్ పని చేస్తుండగా… షమీమ్ 2013లో గ్రూప్-2 ఉద్యోగం పొందాడు. అనంతరం రాజశేఖర్ నుంచి అతడు గ్రూప్-1 ప్రశ్నాపత్రం తీసుకున్నాడు. ఈ క్రమంలో… గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తనకు రాజశేఖర్ ఇచ్చినట్లు షమీమ్ అధికారుల ముందు ఒప్పకున్నాడు. మరోవైపు ఎన్నారైలు కూడా ఈ పరీక్షలు రాశారని తేలడంతో.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు.