వార్డు మెంబర్లుగా గెలవలేని వారు బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్లు

BJP shifts focus to Telangana

భారతీయ జనతా పార్టీ ఒక సిద్దాంతం గల పార్టీ. కానీ వార్డు మెంబర్ గెలవలేని వాళ్లు బిజెపి పార్లమెంట్ బోర్డు మెంబర్ లు అయ్యారు. ఈ దేశంలో మోడీ గారు అమిత్ షా ఆధ్వర్యంలో 21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.పరిపూర్ణానంద స్వామి బిజెపిలో చేరగానే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని ఎంతో  మంది యువకులు తమ తమ అభ్యర్దులను గెలిపించుకోవాలని ఉత్సాహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపి ఇప్పుడు నిర్ణయించిన అభ్యర్ధుల వల్ల అధికారం కాదు కదా డిపాజిట్ కూడా రానట్టుంది. గతంలో పోటి చేసి డిపాజిట్ కూడా రాని వారికి మళ్లీ సీట్లిచ్చారు. అటువంటి వ్యక్తులకు  ఏ విధంగా ఇస్తారు.

పి. మురళీధర్ రావు, పేరాల శేఖర్ రావు గార్లు తమ తమ గ్రామాలల్లో వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి మనుషులు. ఇవాళ తెలంగాణ పార్లమెంట్ బోర్డు మెంబర్లయ్యారు. కొన్ని జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, బూత్ లెవల్ కార్యకర్తలు అహర్నిషలు పని చేస్తుంటే సామాజిక వర్గాల పేరుతో కొందరికే అవకాశాలిస్తున్నారు. 

రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అని వేరు చేసి తమ రావు వర్గాల వారికి టికెట్లు ఇస్తూ సామాజిక వర్గాల వారిని అణగదొక్కుతున్నారు. వీళ్ల దగ్గర అయ్యా అయ్యా అని బతిలాడిన వారికి టికెట్లు ఇస్తూ లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన నాయకులను బాధపెడుతూ ఏసి రూముల్లో కూర్చొని ఎవరికో టికెట్ ఇస్తే కార్యకర్తలు పని చేస్తారా?  వేరే రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో కార్యకర్తలంతా బాంబులు పేల్చి సంబరాలు చేశారు. తెలంగాణలో పార్టీని నాశనం చేసే వారిని తరిమి కొడితేనే తెలంగాణలో బిజెపి బాగుపడుతది. పార్టీలో టికెట్ల కోసం పైసలు వసూలు చేస్తూ పబ్బం గడిపేవాళ్లు కూరగాయలను జోకినట్టు జోకి టికెట్లిస్తే మిగిలిన వారు ఏం అయిపోవాలి.. మిగిలిన వారిని ఏట్లో కలవమంటారా..

మురళీధర్ రావు, చంద్రశేఖర్ రావు గార్లు ఓ విషయం చెప్పాలి. మీరు చదువుకున్న రోజుల్లో మీతో చదువుకున్న వాళ్లే మీ నాయకత్వం వద్దనుకొని కరీంనగర్ మాజీ జిల్లా అధ్యక్షులు కొత్తా శ్రీనివాస్ రెడ్డి గారిని కాలేజి ప్రెసిడెంట్ గా గెలిపించారు. కానీ మీరు పొమ్మనలేక పొగబెట్టినట్టు పార్టీ నుంచి పంపించారు. సంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లా ప్రెసిడెంట్ పదవుల నుంచి రెడ్డి, బిసి లను దించి రావుల రాజ్యం ఏలుతున్నారు. కార్యకర్తల మనోభావం దెబ్బతీయడంతో నాలాంటి కార్యకర్తలెందరో పార్టీని వీడుతున్నారు. వారంతా వెళ్లిపోతుంటే చాలా బాధగా ఉంది.

బహిరంగ సభలల్లో ఎవరో రాసిస్తే మాట్లాడే మీరు పార్లమెంట్ మెంబర్లుగా ఉన్నారు. మీటింగ్ లకు కనీసం కార్యకర్తలను మేనేజ్ చేయరాని వారు ఎమ్మెల్యే  సీట్ల సెలక్షన్ బోర్డు, పార్లమెంట్ బోర్డు మెంబర్లుగా ఉండటం బాధాకరం. ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేయాలని కోరుతూ…

ఇట్లు…

ఆవేదనతో… 

పైడిపెల్లి పృథ్వీరాజ్ గౌడ్, వరంగల్ జిల్లా బిజెపి యువ నేత,

సెల్ నంబర్..7731861429

(నోట్ : ఈ అభిప్రాయాలు రచయితవి మాత్రమే. తెలుగురాజ్యం కు సంబందం లేదు)