Kalisetti Appala Naidu – YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిప్పులు చెరిగారు. కన్నతల్లి, తోబుట్టువుల పట్ల కనీస గౌరవం లేని వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎలా రాణిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ తీరు రాష్ట్ర పరువును జాతీయ స్థాయిలో మంటగలుపుతోందని మండిపడ్డారు.
సొంత కుటుంబంపైనే విషప్రచారమా?
కన్నతల్లి విజయమ్మను కోర్టుల పాలు చేస్తూ, తన ‘పేటీఎం బ్యాచ్’తో ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం అత్యంత హేయమైన చర్య అని అప్పలనాయుడు విమర్శించారు. “సొంత కుటుంబంలోని మహిళలకే రక్షణ ఇవ్వలేని వ్యక్తి, రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఏం భరోసా ఇస్తాడు? ఇది కేవలం వారి ఇంటి వ్యవహారం కాదు, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ మనోభావాలకు సంబంధించిన అంశం” అని ఆయన స్పష్టం చేశారు. జగన్ కుటుంబ సభ్యులకు టీడీపీ నైతిక మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
ఉత్తరాంధ్రను ‘ఉత్తుత్తి ఆంధ్ర’గా మార్చారు
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఆ ప్రాంతాన్ని ‘ఉత్తుత్తి ఆంధ్ర’గా మార్చేశారని అప్పలనాయుడు ఆరోపించారు. అక్కడి వనరులను దోచుకోవడం తప్ప యువతకు ఉపాధి కల్పించలేదని విమర్శించారు. దానికి భిన్నంగా ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు చూపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెండు కళ్లు: స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉత్తరాంధ్ర దశ మార్చే రెండు భారీ ప్రాజెక్టుల గురించి ఎంపీ వివరించారు. రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ మెగా ప్రాజెక్టుకు సోమవారం శంకుస్థాపన జరగనుంది. దీని ద్వారా లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెండు కళ్ల వంటివని ఆయన అభివర్ణించారు.
వ్యవస్థలను భ్రష్టుపట్టించే సైకో మనస్తత్వం
జగన్ మనస్తత్వాన్ని ‘సైకో మనస్తత్వం’గా అభివర్ణించిన అప్పలనాయుడు, వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా, అబద్ధాలు ప్రచారం చేస్తున్న జగన్ను రాజకీయంగా ఓడించడమే కాకుండా, సమాజం నుంచే బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

