Custodial Death Case: శాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్ష!

Custodial Death Case: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తమిళనాడు తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పును ప్రకటించింది. జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ల మృతికి కారణమైన తొమ్మిది మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఘటనను “అత్యంత అరుదైన కేసు” (Rarest of rare) గా న్యాయస్థానం అభివర్ణించింది.

అసలేం జరిగింది? 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో తూతుకుడి జిల్లా శాత్తాన్‌కుళంలో మొబైల్ షాపు నడుపుతున్న జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌లు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు దుకాణం తెరిచారనే ఆరోపణతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

స్టేషన్‌లో ఉన్న సమయంలో పోలీసులు వారిని అత్యంత అమానుషంగా వేధించారు. పోలీసుల టార్చర్‌తో తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులు కస్టడీలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. మానవ హక్కుల ఉల్లంఘనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ (CBI), పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి క్రూరంగా వ్యవహరించారని సాక్ష్యాధారాలతో నిరూపించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. నిందితులకు అత్యంత కఠిన శిక్ష విధించింది.

మరణశిక్ష పడిన వారు:

ఎస్. శ్రీధర్ (ఇన్‌స్పెక్టర్)

పి. రఘు గణేశ్ (సబ్ ఇన్‌స్పెక్టర్)

కె. బాలకృష్ణన్ (సబ్ ఇన్‌స్పెక్టర్)

ఎస్. మురుగన్ (హెడ్ కానిస్టేబుల్)

ఎ. సమదురై (హెడ్ కానిస్టేబుల్)

ఎమ్. ముత్తురాజ్ (కానిస్టేబుల్)

ఎస్. చెల్లదురై (కానిస్టేబుల్)

ఎక్స్. థామస్ ఫ్రాన్సిస్ (కానిస్టేబుల్)

ఎస్. వైల్‌ముత్తు (కానిస్టేబుల్)

ఈ కేసులో 10వ నిందితుడిగా ఉన్న స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాల్‌దురై గతంలోనే కొవిడ్‌తో మరణించారు.

న్యాయం గెలిచింది!
ఖాఖి దుస్తుల చాటున దాగి ఉన్న క్రూరత్వాన్ని కోర్టు శిక్షించిందని మృతుల కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు ఈ తీర్పును స్వాగతించారు. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ తీర్పు నిరూపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trump New Decision Creates Tension In India | Iran Vs Israel War | Telugu Rajyam