Pastor Praveen Pagadala: ఏపీలో పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు ఎందుకు ఈ స్థాయిలో దుమారం రేపుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజమహేంద్రవరం శివారులోని కొంతమూరు వద్ద జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కేసు కేవలం రోడ్డు ప్రమాదమా, లేక ఇతర కోణాలున్నాయా అనే దానిపై వివిధ సంఘాలు, నాయకులు ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవ సంఘాల నేతలు ఇది సహజ మరణం కాదంటూ తేల్చేస్తుండటంతో మృతిపై దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది.

ప్రాథమికంగా పోలీసుల ప్రకారం, హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌ బైక్‌పై బయలుదేరిన ప్రవీణ్‌ కుమార్, రాజమహేంద్రవరం చేరుకునే క్రమంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారట. రాత్రివేళ రహదారిపై నుంచి జారి పడగా, అనంతరం వాహనం ఢీకొన్నదని పోలీసులు పేర్కొంటున్నారు. మరుసటి రోజు ఉదయం వరకు ఎవరూ గమనించకపోవడంతో గాయాల తీవ్రతతో ఆయన మరణించారని తెలిపారు. అయితే ప్రవీణ్ శరీరంపై ఉన్న గాయాలు, ప్రమాద సమయంలో ఏవీ స్పష్టంగా వెలుగులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. సీఎం చంద్రబాబు, డీజీపీతో మాట్లాడి అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. అలాగే, తూర్పు గోదావరి ఎస్పీ డి. నరసింహ కిశోర్‌కు హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసి పూర్తి పారదర్శకతతో దర్యాప్తు జరుగుతుందన్నారు.

కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో పాస్టర్ ప్రయాణ వివరాలు, ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల విచారణలు కీలకంగా మారాయి. ప్రవీణ్ అనుచరులు, సంఘాల వర్గాలు ఈ ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు తమ ఆందోళనను కొనసాగించనున్నట్లు స్పష్టం చేయడంతో… ఈ కేసు ఇప్పటికీ తుది నిర్ణయానికి రాకుండా జాతీయ స్థాయిలో సైతం చర్చకు దారితీసేలా మారుతోంది.

ఇదే సాక్ష్యం? | Senior Journalist Bharadwaj Shoking Facts | Pastor Praveen Pagadala | Telugu Rajyam