MP Chamala Kiran Kumar: హరీశ్ రావు ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజం

MP Chamala Kiran Kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కోబోతున్న తరుణంలో, ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు బయటకు రాకుండా హరీశ్ రావు ‘ట్రిక్స్’ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు తనను విచారణకు పిలుస్తున్నారనే విషయం తెలియగానే, హరీశ్ రావు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. “తెలంగాణ సమాజానికి ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న కుట్రలను తెలియజేయడమే ప్రభుత్వ లక్ష్యం. కానీ, విచారణలో బయటపడే నిజాలను దాచిపెట్టేందుకు బీఆర్‌ఎస్ నేతలు పన్నాగం పన్నుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి తన బంధువు సృజన్ రెడ్డికి సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారని హరీశ్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను కిరణ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. సృజన్ రెడ్డి వాస్తవానికి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడని ఆయన గుర్తు చేశారు.

గత బీఆర్‌ఎస్ పాలనలో కూడా సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు దక్కాయని వెల్లడించారు. సొంత అల్లుడిని ఇప్పుడు రాజకీయం కోసం ఎందుకు బద్నాం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ నేతల మాదిరిగా దోచుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

సింగరేణిలో జరుగుతున్న ప్రచారాలపై వాస్తవాలు తేలాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై లోక్‌సభ సభ్యుడిగా తాను కేంద్ర గనుల శాఖకు లేఖ రాస్తానని ఎంపీ ప్రకటించారు. అలాగే, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్, హరీశ్ రావులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

హిల్ట్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కేవలం చర్చ మాత్రమే చేసిందని, అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చామల స్పష్టం చేశారు. రూ.5 లక్షల కోట్ల అవినీతి అంటూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న హడావుడి కేవలం రాబోయే రాజకీయ ప్రయోజనాల కోసమేనన్నారు. “సొంత ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కవిత గారే స్వయంగా చెప్పారు, దీన్ని బట్టి గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు” అని ఆయన ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో, ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

AR Rahman Controversial Comments EXPOSED By Dasari Vignan || Telugu Rajyam