ప్రపంచ వ్యాప్తంగా ఆటోమేషన్ విస్తరిస్తున్న వేళ, కొన్ని రంగాల్లో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. డెలివరీ, వేర్హౌసింగ్, డేటా ప్రాసెసింగ్ వంటి తక్కువ నైపుణ్యంతో కూడిన ఉద్యోగాల్లో కూడా రోబోటిక్ వ్యవస్థలు, ఎఐ టూల్స్ భారీగా ప్రవేశించడంతో మానవ అవసరం తగ్గిపోతోంది. అమెరికాలో ఇప్పటికే UPS, USPS వంటి దిగ్గజ సంస్థలు వేల ఉద్యోగాలను తొలగిస్తూ చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రభావం భారత్లోనూ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
UPS సంస్థ 2025 నాటికి 20 వేల ఉద్యోగాలను తొలగించి, సుమారు 73 పంపిణీ కేంద్రాలను మూసివేయనున్నట్లు ప్రకటించింది. మరింత వేగవంతమైన డెలివరీ కోసం ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీ, ఆటోమెటెడ్ సార్టింగ్ సిస్టమ్స్ను ప్రవేశపెడుతోంది. USPS సంస్థ కూడా 10 వేల ఉద్యోగాలను స్వచ్ఛంద రిటైర్మెంట్ ద్వారా తగ్గిస్తూ, $36 బిలియన్ ఆదాయ లక్ష్యంతో వ్యూహాలను అమలు చేస్తోంది. ఇది ఖర్చులను తగ్గించడమే కాక, ఆధునికీకరణను వేగవంతం చేయడానికీ ప్రయత్నం.
భారత్లో ఇప్పటికే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు రోబోటిక్ వేర్హౌస్లు, డెలివరీ డ్రోన్లపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇది డెలివరీ సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతోంది. అయితే, ఈ పరిణామాలు సుమారు లక్షలాది డెలివరీ సిబ్బందికి, గోడౌన్ కార్మికులకు హెచ్చరికగా మారే అవకాశముంది. ఆటోమేషన్ వల్ల తక్కువ శిక్షణతో పనిచేసే ఉద్యోగాలే మొదట నష్టపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, ఎఐ, ఆటోమేషన్ కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా తీసుకురావచ్చు. డేటా మేనేజ్మెంట్, మెయింటెనెన్స్, ఆపరేషనల్ మానిటరింగ్ వంటి రంగాల్లో నూతన నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. ఆటోమేషన్ నుంచి రక్షణ పొందాలంటే, భారత్ మానవ వనరులు కొత్త స్కిల్స్ను అలవర్చుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.