ఐపీఎస్ నాగేశ్వరరావు – ఆయన అదో టైపు

IPS Nageswara Rao

తెలుగువాడైన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, ఒక వారంలో రిటైర్ అవుతున్న సమయంలో హిందూత్వకు అనుకూలంగా ట్వీట్ చేసి వివాదాస్పదమయ్యారు. స్వాతంత్య్ర కాలం నాటి ముస్లిం విద్యావేత్తలను కించపరిచే విధంగా, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఒక వారం క్రితం జులై 25 న ఆయన చేసిన సుదీర్ఘ  ట్వీట్ తో  అప్రతిష్ట పాలయ్యారు. రిటైరైన తర్వాత మంచి పోస్టును ఆశించి ఆయన బిజెపి పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా చేసి ఉంటారని రిటైర్డు ఐపీఎస్ అధికారులు అభిప్రాయ  పడుతున్నారు.

ఆయన దేశంలోనే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. తెలుగువాడు. పేరు మన్నెం నాగేశ్వరరావు. వరంగల్ జిల్లా వాసి అయిన ఆయన 1986 బ్యాచ్ లో ఐపీఎస్ కు సెలక్ట్ అయి ఒడిశా కేడర్ కు ఎంపికయ్యారు. సిబిఐ అడిషినల్ డైరెక్టర్ గా ,  2018 లో  కొన్ని రోజులు మాత్రమే సిబిఐ ఇంచార్జి డైరెక్టర్ గా పనిచేశారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిబిఐ డైరెక్టర్ పదవి చేపట్టిన రెండో తెలుగు అధికారి ( మొదటి వారు విజయ రామారావు) గా ఆయన చరిత్రకు ఎక్కారు. అయితే ఆయన అవినీతి చరిత్రపై విమర్శలు రావడంతో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆయనను ప్రాధాన్యత లేని ఫైర్ సర్వీసెస్, హోమ్ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ఈరోజుతో ( జులై 31 ) ఆయన రిటైర్ అవుతున్నారు. హిందుత్వ భావ సారూప్యత ఉన్నందు వల్లనే, అవినీతి ముద్ర ఉన్నా ఆయనను బిజెపి ప్రభుత్వం సిబిఐ చీఫ్ గా నియమించిందని ఆరోపణలు వచ్చాయి. ఆయన ద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పాలు చేయవచ్చని బిజెపి ప్రభువులు భావించినట్టు విమర్శలు వచ్చాయి. బిజెపి అగ్రనాయకుడు వెంకయ్య నాయుడు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయనకు సీబీఐలో ప్రవేశం లభించినట్టు చెబుతారు. కమ్మ ఐపీఎస్ ఆఫీసర్స్ బ్లాగ్ లో ఆయన పేరు, వివరాలు ఉన్నాయి.

నాగేశ్వర రావు తాజాగా ట్విటర్ లో వెలిబుచ్చిన అభిప్రాయాలు “రాజకీయ ప్రేరేపితంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, మత విద్వేషాలను రెచ్చగోట్టేవిగా ఉన్నాయి” అంటూ సిపిఎం నేత బృందా కారత్ కేంద్ర హోమ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రిమినల్ కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడైన మౌలానా  అబుల్ కలాం ఆజాద్ తో సహా అనేక మంది ముస్లిం విద్యావేత్తలను కించపరుస్తూ తీవ్రమైన విమర్శలను నాగేశ్వరరావు చేశారని హోమ్ మంత్రికి ఫిర్యాదు చేశారు.

ఆయన ఆది నుంచి అదో టైపు

పూవు పుట్టగానే పరిమళించినట్టు ఒరిస్సా కేడర్ పోలీసు అధికారిగా తొలి సంవత్సరాల్లోనే వివాదాస్పదుడయ్యారు. నబీరంగ్ పూర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన,  విద్యార్థులు మత మార్పిడులు చేసుకోకుండా చూడాలంటూ జిల్లాలోని హెడ్మాస్టర్లకు లేఖలు రాశారు. 2014 లో  ఒడిశా ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీగా ఉన్నప్పుడు ఆయనపై మూడు కోట్ల రూపాయల కుంభకోణంలో ఆరోపణలు వచ్చాయి. హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ ఇండియా కుంభకోణాల్లో కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నట్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీటర్ లో పేర్కొన్నారు. పిన్న వయసులోనే ఐపీఎస్ కు ఎంపికైన నాగేశ్వరరావు జాతీయ స్థాయిలో తెలుగువారి ఖ్యాతిని పెంచాల్సింది పోయి ఈ విధంగా వివాదాస్పదుడిగా మిగిలిపోవడం దురదృష్టకరం.  

—శాంతా రామ్