Harish Rao: మార్కెట్ భూములపై సీఎం కన్ను: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు!

Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ అమ్మేయడమే ఈ ప్రభుత్వ ఎజెండాగా మారిందని ఆయన ఆరోపించారు. బుధవారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

కోహెడలో ఆసియాలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు రూ. 10 కోట్ల నష్టపరిహారం ఇప్పించి భూమిని సేకరించినట్లు తెలిపారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వెయ్యి కోట్ల రూపాయలతో డీపీఆర్ (DPR) సిద్ధం చేశామని వివరించారు. ఇప్పుడు ఈ భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను పడిందని, వాటిని దళారులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పని చేయాలే తప్ప, భూములను అమ్మి వ్యాపారం చేయడం సరికాదని హరీశ్ రావు హితవు పలికారు. “భూములు కనిపిస్తే చాలు అమ్మేయడం, ఆ సొమ్ముతో పబ్బం గడుపుకోవడం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారు. కోహెడ మార్కెట్ స్థలాన్ని వేరే అవసరాలకు మళ్లించడం రైతులను వంచించడమే” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక రైతుల ప్రయోజనాల కోసం కేటాయించిన భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మార్కెట్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

రాష్ట్ర రాజధాని శివారులోని ఈ కీలకమైన భూముల చుట్టూ ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది. హరీశ్ రావు ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Kutami Govt Focus On Bhogapuram | Chandrababu | Telugu Rajyam