టిఆర్ఎస్ లో హరీష్ రావు పై మళ్లీ డౌటనుమానం

టిఆర్ఎస్ పార్టీలో స్టార్ ఇమేజ్ కలిగిన నాయకుల జాబితాలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒకరు. మొన్నటి ముందస్తు ఎన్నికల వరకు కూడా ఆయన ఆ పార్టీకి ట్రబుల్ షూటర్ గానే వ్యవహరించారు. కొడంగల్, గద్వాలలో రేవంత్ రెడ్డి, డికె అరుణ లాంటి ప్రత్యర్థులను హరీష్ రావు తన వ్యూహ చతురతతో మట్టి కరిపించారు. అంతేకాకుండా లక్ష పైచిలుకు ఓట్లతో రికార్డు మెజార్టీ సాధించారు. ఈ పరిస్థితుల్లో జనాల్లో ఇంతటి క్రేజ్ ఉన్న హరీష్ రావు చుట్టూ రకరకాల పుకార్లు శికారు చేస్తున్నాయి. టిఆర్ఎస్ లో సమ్ థింగ్ సమ్ థింగ్ అన్నట్లు డౌటనుమానం వ్యక్తమవుతోంది. అసలు టిఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? 

తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేసేందుకు ఆయన రెండోసారి సిఎం అయిన తర్వాత సమీక్షలతో వేగం పెంచుతున్నారు. రెండు రోజులపాటు హెలిక్యాప్టర్ మీద కాళేశ్వరం సహా గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలియదిరిగారు. ఈ టూర్ లో సిఎం కేసిఆర్ తో పాటు తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్, మాజీ మిషన భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఇరిగేషన్ ఎక్స్ పర్ట్ (మొన్నటి వరకు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వద్ద ఓఎస్ డీ గా పనిచేసిన అధికారి ప్రస్తుతం సిఎం ఓఎస్ డి గా నియమితులైన) శ్రీధర్ దేశ్ పాండే, చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఎస్ ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు , ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, సీఈ వెంకటేశ్వర్లు, లిప్ట్ సలహాదారు పెంటారెడ్డి, మెగా ఎండీ కృష్ణారెడ్డి లాంటి ఇరిగేషన్ నిపుణులంతా హాజరయ్యారు. ఇది ఇరిగేషన్ టూర్ కాబట్టి వారంతా హాజరు కావాల్సిందే కూడా. కానీ హరీష్ రావు కూడా హాజరైతే బాగుండేది కదా? అని పార్టీ వర్గాల్లో ఒక చర్చ మాత్రం అంతర్గతంగా సాగుతున్నది. మరి హరీష్ రావు ఎందుకు హాజరు కావాల్సింది అని అనుకుంటున్నారంటే?

మెదక్ జిల్లాకు చెందిన ఒక టిఆర్ఎస్ నాయకుడు చెప్పిన విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ‘‘హరీష్ రావు నిన్నటి వరకు తెలంగాణ ఇరిగేషన్ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఆయన రాత్రింబవళ్లు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. రాత్రిపూట ప్రాజెక్టుల వద్దే నిద్రించి మంత్రుల పని తీరులో కొత్త ఒరవడి సృస్టించారు. ఆయన మంత్రిగా ఉన్న కాలంలో ఎక్కువ సమయం ప్రాజెక్టుల వద్దే ఉన్నారు. మరి అటువంటి నాయకుడు, సిఎం కేసిఆర్ ప్రాజెక్టుల టూర్ లో ఉండకపోవడం పెద్ద వెలితి కాదా? ’’ అని ఆయన పేర్కొన్నారు. 

మొన్నట ివరకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అహోరాత్రులు పనిచేసిన హరీష్ రావును కేసిఆర్ ఈ టూర్ కు పిలవలేదా? లేదంటే పిలిచినా ఆయన రాలేదా అన్నది తేలాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం సిద్ధిపేటలోనే ఉంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కేసిఆర్ టూర్ జరిగిన రోజుల్లో కూడా సిద్ధిపేటలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు ఇంతకాలం భుజాన మోసినందున ఆయనను కూడా ఈ టూర్ లో ఇన్వాల్వ్ చేసి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేది కదా? అని కొందరు పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. 

సోషల్ మీడియాలో గుసగుసలు షురూ 

సోషల్ మీడియాలో వైలర్ అయిన పోస్టు…

ఇక హరీష్ రావును టిఆర్ఎస్ లో వేగంగా పక్కన పెడుతున్నారని సోషల్ మీడియాలో గుసగుసలు షురూ అయ్యాయి. ముందస్తు ఎన్నికల తర్వాత నుంచి ఆయన పెద్దగా మీడియాలో కనపడిన దాఖలాలు లేవు, వినపడిన దాఖలాలు లేవు. దీన్నిబట్టి హరీష్ రావును టిఆర్ఎస్ లో పక్కన పెట్టినట్లే అని సోషల్ మీడియా కోడై కూస్తున్నది. ముందస్తు ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత కేటిఆర్ కు వర్కింగ్ ప్రసిడెంట్ లాంటి పరిణామాలు జరిగిన తర్వాత హరీష్ పెద్దగా మీడియాలో కనిపించలేదు. కేటిఆర్ ఛార్జ్ తీసుకునేవేళ తెలంగాణ భవన్ కు ఇలా వచ్చి అలా తిరుపతి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇక హరీష్ రావు గొంతు వినపడలేదు.  ఈపరిణామాలపై మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా ఫోకస్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో దుమారం మాత్రం మొదలైందని చెప్పవచ్చు. 

గతంలోనూ హరీష్ రావు తాలూకు వార్తలను టిఆర్ఎస్ అనుకూల మీడియాలో ప్రసారం కాలేదు. ఆయన వార్తలపై అప్రకటిత నిషదం విధించారా అన్న అనుమానాలు కూడా కలిగాయి. తాజాగా ఈ రకమైన ప్రచారం జరగడం గమనార్హం.

హరీష్ కు ఇరిగేషన్ లేనట్లేనా?

హరీష్ రావుకు రానున్న కేసిఆర్ కేబినెట్ లో ఏ మంత్రి పదవి దక్కుతుందో అన్న ఊహాగానాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయనకు ఇరిగేషన్ మాత్రం ఇవ్వబోరని కేసిఆర్ రెండు రోజుల ప్రాజెక్టుల పర్యటనతో తేలిపోయిందని అంటున్నారు. ఇరిగేషన్ తన వద్దే ఉంచుకుంటానని కేసిఆర్ ప్రకటించినందున ఇక హరీష్ రావుకు వేరే శాఖలు ఏమైనా అప్పగించే చాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే హరీష్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చని టిఆర్ఎస్ లోని ఒక సెక్షన్ లీడర్లు ప్రచారం చేస్తుండగా అసలు హరీష్ రావుకు మంత్రివర్గంలో బెర్త్ అనుమానమే అని ఇంకో సెక్షన్ టిఆర్ఎస్ నేతల్లో గుసగుసలు మొదలయ్యాయి. హరీష్ పార్లమెంటుకు పోటీ చేయవచ్చని కూడా టాక్ నడుస్తోంది.