Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల శిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కుంభకోణంపై సీబీఐ కోర్టు ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. దాదాపు 15 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కేసులో పలువురికి శిక్షలు ఖరారవ్వగా, కొందరికి ఊరట లభించింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు ఈ తీర్పును ప్రకటించింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించింది. ఆయనతో పాటు ఓఎంసీ మైనింగ్ కంపెనీకి చెందిన బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, లింగారెడ్డి అనే మరో నిందితుడికి కూడా అదే విధమైన శిక్ష విధించారు. అయితే అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందం ఈ కేసులో నిర్దోషులుగా తేలగా, 2022లోనే శ్రీలక్ష్మీని కోర్టు డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే.

ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం వెలుగులోకి రావడం, కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం, విచారణలో జరిగిన మలుపులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. 2009లో అప్పటి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. 2011లో మొదటి చార్జ్‌షీట్ దాఖలు కాగా, మొత్తం 9 మందిని నిందితులుగా పేర్కొంది. కోర్టు 219 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి, 3400 పత్రాలను పరిశీలించింది.

ఈ తీర్పుతో ఈ కేసు కొత్త దశలోకి ప్రవేశించింది. రాజకీయ నేతల పాత్ర, అధికారులు ఇచ్చిన అనుమతులు, అక్రమ లాభాల నేపథ్యం అంశాలు తిరిగి దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. ఇక శిక్ష ఖరారైన వారు అప్పీలకు వెళ్లే అవకాశముంది.

గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేసిన హీరో శోభన్ బాబు మనవడు| Actor Shoban Babu Grandson Dr. Surakshith | TR