JD Lakshmi Narayana: గాలి జనార్దన్ కేసు వెనక ఉన్న రహస్యాలు.. జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఏమన్నారంటే..

ఒబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జ‌నార్దన్‌రెడ్డి కి నాంప‌ల్లి సీబీఐ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో మళ్లీ ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా నాటి సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్ వీవీ లక్ష్మీనారాయ‌ణ (జేడీ) త‌న అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. గాలి రెడ్డి అంత ఈజీగా త‌మ చేతిలోకి రాకుండా చాలా అవాంతరాలు ఎదురయ్యాయని జేడీ గుర్తు చేశారు. కేసు మొదలైనప్పటినుంచి ఏ దిశలో దర్యాప్తు ప్రారంభించాలన్నది పెద్ద సవాలుగా మారిందని, కొన్ని కీలక వ్యవస్థలు గాలి వెనుక నిలిచాయని ఆయన అన్నారు.

రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగే మైనింగ్ కేసు కావడంతో అక్కడి అధికారులు, ఇక్కడి అధికారులు ఇద్దరూ సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జేడీ తెలిపారు. అయితే, అనేక మంది అధికారులు సహకారం ఇవ్వకుండా మాయమాటలతో తప్పించుకునే ప్రయత్నాలు చేశారని, సీబీఐ విచారణకు వస్తున్నారన్నప్పుడు ముఖ్యమైన అధికారులు సెలవులు తీసుకునేవారని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు, గాలి జనార్దన్‌రెడ్డి మనుషులు అడ్డుపడతారేమోనని భయంతో, సీబీఐ అధికారులు కాదని, ఐటీ అధికారులు అని చెప్పి, కేవలం తనిఖీల కోసం వస్తున్నామంటూ వెళ్లి అరెస్టు చేశామన్నారు.

ఆ అరెస్టు సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వెనుక కూడా అనేక చతురతలు వున్నాయని తెలిపారు. అరెస్టు తర్వాత తమపై బెదిరింపులు వస్తాయని కొందరు హెచ్చరించినా, పక్కా ఆధారాలతో కేసు దాఖలు చేశామని జేడీ వెల్లడించారు. కేసు విచారణ ఆలస్యం కావడానికి రాజకీయ కారణాలే ప్రధానమని, ఎందుకంటే తాము డీల్ చేస్తున్న అధికారులు తరచుగా బదిలీ అయ్యేవారని చెప్పారు. ఒక రోజు ఉన్న అధికారి మరుసటి రోజు లేకపోవడమే సమస్యగా మారిందని గుర్తు చేశారు.

ఇలాంటి పెద్ద కేసులు త్వరగా పరిష్కారం కావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అత్యవసరమని, 14 సంవత్సరాల తర్వాత తీర్పు రావడం ఆందోళన కలిగిస్తోందని జేడీ సూచించారు. ఇటువంటి వ్యవస్థలు మరింత సమర్థంగా పని చేయడానికి అవసరమైన సంస్కరణలు తక్షణమే తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.

Public EXPOSED: Cm Chandrababu Comments On Amaravati || Ap Public Talk || Ys Jagan || Telugu Rajyam