కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు పెద్ద కబురు అందించింది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు, ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించాలనుకునే వారికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక రుణ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఈ పథకం ద్వారా దాదాపు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలు లబ్ధి పొందే అవకాశం ఉంది. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీని వల్ల పేదరికాన్ని తగ్గించడంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వీలవుతుంది.
కేవలం వ్యాపార అభివృద్ధి మాత్రమే కాకుండా, ఈ పథకం ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా సృష్టించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మహిళా సాధికారతకు మరింత ఊతమిచ్చేలా, వీరు స్వతంత్రంగా వ్యాపార రంగంలో నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉండటంతో, ఇది సామాజిక పురోగతికి దోహదం చేసే నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యాపారం చేయాలనుకునే మహిళలకు కేంద్ర ప్రభుత్వం మరింత వనరులను అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది.