Secretariat Employee Suspended: సచివాలయంలో కలెక్టర్ మెరుపు తనిఖీ: నైట్ ప్యాంట్‌తో విధులకు వచ్చిన ఉద్యోగి సస్పెండ్!

Secretariat Employee Suspended: ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి, డ్రెస్ కోడ్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ సచివాలయ ఉద్యోగిపై బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. నైట్ ప్యాంట్‌తో విధులకు హాజరైన సదరు ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

నైట్ ప్యాంట్‌తో డిజిటల్ అసిస్టెంట్.. కలెక్టర్ సీరియస్ బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంట్ ధరించి విధుల్లో ఉండటం చూసి కలెక్టర్ విస్మయానికి గురయ్యారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేటప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలు, డ్రెస్ కోడ్ లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇలాంటి ప్రవర్తన సహించేది లేదని హెచ్చరిస్తూ, అతడిని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

కేవలం డ్రెస్ కోడ్ మాత్రమే కాకుండా, సచివాలయ పనితీరుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ప్రజలు సమర్పించిన అర్జీలలో 11 అర్జీలు గడువు ముగిసినా (Beyond SLA) ఇంకా పెండింగ్‌లో ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

‘స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు’ లక్ష్యంగా పటిష్ట నిఘా:-  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల పనితీరును మెరుగుపరిచేందుకు ‘స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు’ కార్యక్రమం కింద ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమలు చేస్తున్న కీలక మార్పులు.

ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య, తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత ఫేస్ రికగ్నేషన్ (Facial Recognition) ద్వారా హాజరు నమోదు చేయాలి. కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకు ప్రతి నెలా 3 నుంచి 16 సార్లు సచివాలయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయ సిబ్బంది పనితీరు, ప్రవర్తనపై ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసేలా ప్రతి సచివాలయంలో QR కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. దీన్ని స్కాన్ చేసి సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అన్న విషయాన్ని ఫిర్యాదు రూపంలో పంపవచ్చు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పని చేయాలని, లేనిపక్షంలో బాపట్ల ఘటన తరహాలోనే చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

Chandrababu Supports Delimitation, KS Prasad Reaction | Modi | Telugu Rajyam