BV Venkataramadu: తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలాన్ని మరింత పెంపొందించే దిశగా, పార్టీకి విశ్వసనీయంగా, సమర్థవంతంగా సేవలందిస్తున్న నాయకులకు తగిన గుర్తింపు ఇస్తోంది. ఈ మేరకు టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురంనకు చెందిన బీ.వీ. వెంకటరాముడుని మరోసారి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా నియమించింది. అంతేకాదు…మొదటి నుంచీ రాముడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వస్తున్నారు. పార్టీ పట్ల విశ్వాసనీయత, అప్పగించిన పనిని చిత్తశుద్ధితో చేయడం బీవీ రాముడి మార్క్. దీంతో మరోమారు మీడియా బాధ్యతలను అప్పగించింది టీడీపీ అధిష్టానం.
మూడు దశాబ్ధాలుగా మొక్కవోని దీక్షతో… తెలుగుదేశం పార్టీకి దాదాపు మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్నారు వెంకటరాముడు. తన రాజకీయ ప్రస్థానాన్ని 1996లో అనంతపురం పట్టణ కార్యదర్శిగా ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రచార కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. పార్టీ అప్పగించిన ప్రతీ బాధ్యతను కర్తవ్యనిష్టతో చేపట్టారు. ప్రతీ దశలోనూ తన ప్రతిభను బీవీ రాముడు చాటుకున్నారు. ముఖ్యంగా 2004 నుంచి 2021 వరకు పార్టీ ప్రచార వ్యవహారాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. అలాగే అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘మీకోసం’, ‘రైతు పోరుబాట’, ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర వంటి ప్రజాహిత కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బీవీ రాముడు క్రియాశీలకంగా పని చేశారు. రాముడి చురుకైన పాత్రను గుర్తించిన పార్టీ…2022లో రాయలసీమ మీడియా కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించింది. దీంతో ప్రాంతీయ స్థాయిలో పార్టీ స్వరాన్ని బలంగా వినిపించారు బీవీ రాముడు.

యువగళంలో తానూ ఒక అడుగై… నారా లోకేష్ 2023లో చేపట్టిన చారిత్రాత్మక ‘యువగళం’ పాదయాత్రలోనూ బీవీ రాముడు కీలకంగా వ్యవహరించారు. అంతపెద్ద పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా మీడియా బాధ్యతను చూడటమంటే తల బొప్పికట్టే వ్యవహారం. అంతేకాదు…ఎంతో ఖర్చుతో కూడుకున్నది కూడా. అయితే ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాధ్యతలు చేపట్టారు. లోకేష్తో కలిసి అన్ని పాదయాత్రలో 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 228 రోజుల పాటు 3,132 కి.మీ పాదయాత్ర చేశారు. పాదయాత్ర ఆసాంతం మీడియా యాత్రా విశేషాల కవరేజ్లో కీలక భూమిక పోషించారు. అనంతరం మళ్లీ లోకేష్ చేపట్టిన ‘శంఖారావం’ కార్యక్రమాన్నీ అదే స్థాయిలో నిలబెట్టారు.

ప్రచారానికి నై… పనికి సై… సాధారణంగా పార్టీలు ఏదైనా పదవి ఇచ్చి కార్యక్రమాలు నిర్వహించమంటే అధినాయకత్వం దృష్టిలో పడేందుకు నానాపాట్లు పడే ఈ రోజుల్లో..బీవీ రాముడు మాత్రం అందుకు విభిన్నం. ఎక్కడా ఫోకస్ కారు. అసలు ఈ కార్యక్రమాలు చూసేది ఎవరని అడిగినా కనబడేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. పార్టీ పని అప్పగించిందా… సైలెంట్గా చక్కదిద్దామా అన్న రీతిలోనే ఆయన వ్యవహారం ఉంటుంది. అంతేకాదు నామినేటెడ్ పదవులకూ ఎప్పుడూ ఆరాటపడలేదు. అందుకే ఆయన్ను పార్టీలో అత్యంత గౌరవంగా చూస్తారు. ఈ నేపథ్యంలో తనకు మరోసారి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. సమర్థుడికే అవకాశాలు కల్పించారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తనపై నమ్మకంతో మరోసారి మీడియా కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేష్కు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బీ.వీ.వెంకటరాముడు కృతజ్ఞతలు తెలిపారు. మరింత సమర్థవంతంగా తన సేవలను విస్తృతపరుస్తానని రాముడు ఈ సందర్భంగా తెలిపారు.

