Nadendla Manohar: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, పంపిణీలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ సంస్థల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల డెలివరీలో జరుగుతున్న ఆలస్యంపై మంత్రి మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. బుకింగ్స్ మరియు డెలివరీల ప్రక్రియను పారదర్శకం చేసేందుకు, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, గ్యాస్ కొరతను అధిగమించేందుకు 5 కిలోల ఎఫ్టీఎల్ (FTL) సిలిండర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఈ సిలిండర్లు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద లభిస్తాయి. వీటికి ఎటువంటి సబ్సిడీ ఉండదు, మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అవసరమైన వారు మార్గదర్శకాల ప్రకారం వీటిని పొందవచ్చని తెలిపారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలకు ఇంకా కిరోసిన్ అవసరం ఉందని మంత్రి మనోహర్ గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం కిరోసిన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని, అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఎక్కడెక్కడ అవసరం ఉందో గుర్తించి పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించిందని, అదే స్ఫూర్తితో రబీలో కూడా కొనుగోళ్లు జరగాలని మంత్రి మనోహర్ నిర్దేశించారు.
“రాష్ట్రంలో అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలి.” అని మంత్రి మనోహర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు మరియు వివిధ గ్యాస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

