Assistant Commissioner K. Shanti: ఏపీ దేవాదాయ శాఖ ఏసీ శాంతి అరెస్ట్: ఏసీబీ సోదాల్లో బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా!

Assistant Commissioner K. Shanti: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (AC) శాంతిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు, భారీగా అక్రమ ఆస్తులను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మంగళవారం ఉదయం నుంచే తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. సుమారు 10 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో శాంతికి సంబంధించి కీలక డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలు లభ్యమయ్యాయి.

విశాఖపట్నంలోని ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి, రూ. 1.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లలో రూ. 3 లక్షల నగదుతో పాటు ఒక కారు, బైక్ ఉన్నట్లు నిర్ధారించారు.

గతంలో విశాఖలో కోట్ల విలువైన దేవాదాయ భూముల మళ్లింపు, హుండీ లెక్కింపులో అక్రమాలు, ఉన్నతాధికారుల ఆదేశాల ధిక్కరణ వంటి ఆరోపణలపై శాంతి 2024 జూలై నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. అయితే, ఏడాది కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ పొడిగించకూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఇటీవల ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. అప్రాధాన్య పోస్టింగ్ ఇవ్వాలని ఉత్తర్వులు వెలువడిన కొద్ది రోజుల్లోనే ఏసీబీ రంగంలోకి దిగడం గమనార్హం.

సోదాల అనంతరం తాడేపల్లిలోని ఆమె నివాసం వద్ద శాంతిని అదుపులోకి తీసుకున్న అధికారులు, వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. కోర్టు విచారణలో భాగంగా ఆమెను రిమాండ్‌కు కోరనున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికారిణి ఇలా అక్రమ ఆస్తుల కేసులో దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది.

How Mavigun Concept Affected YS Jagan : Explained By Analyst KS Prasad | Telugu Rajyam