ఈ మధ్య జరిగే పరిణామాలు చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అడుగు జాడల్లో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఏ విషయంలో అని ఆశ్చర్యపోతున్నారా…. అది ప్రత్యర్ధ పార్టీలను విమర్శించడంలో.
గతంలో దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు ఒక మోస్తరు మండల నాయకులు వరకు అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి రాజకీయంగా కాకుండా కక్షతో వ్యక్తిగతంగా విమర్శిస్తున్నరా అన్నట్లు విమర్శలు చేసేవారు. అది జగన్ కి ఏ మాత్రం నష్టం చేయకపోగా జనాల్లో ఒక సానుభూతిని మిగిల్చి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించడానికి సహాయపడింది
రాజకీయాలు ఆసక్తితో గమనించేవారు లేదా రాజకీయ పరిణామాలు టీవీలలో చూసే ఏ పార్టీకి చెందని న్యూట్రల్ వర్గాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా ఒక 20 శాతం వరకు వుంటారు. వీరు ఐదు ఏళ్ళు జరిగే అభివృద్ధి సంక్షేమం తో పాటు రాజకీయ హుందాతనాన్ని కూడా బేరీజు వేసుకొని ఓటు రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు.
తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే అప్పట్లో వారు జగన్ పై దాడి జరిగితే అది వారి తల్లి చెల్లి చేయించారని, అలాగే లక్ష్మీపార్వతి ఏదో తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని వేధించారని, జగన్ చెల్లెలు విషయంలో కూడా స్థాయి మరచి చేసిన విమర్శలు తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇవన్నీ తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆ పార్టీ అభిమానులు ఆనంద పడడానికి లేకుంటే ప్రత్యర్థిపై పైచేయి సాధించామని ఒక రాక్షస ఆనందాన్ని కలిగిస్తాయేమో కానీ ఇది దీర్ఘకాలంలో పార్టీకి ఖచ్చితంగా నష్టమే చేస్తుంది.
ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అటువంటి వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు వైసిపి వారు కూడా చేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ నారా లోకేష్ అతని కొడుకు తో పాటు సైకిల్ తొక్కుతూ బయటకు వచ్చిన వీడియోలు మీద వైయస్సార్ పార్టీ లో నెంబర్ టు స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గరనుండి సోషల్ మీడియా కార్యకర్తలు వరకు నారా లోకేష్ మీద బాడీ షామింగ్ చెయ్యడం అనేది న్యూట్రల్ ప్రజలకు రుచించదు.
అధికారంలో ఉన్నప్పుడు చేసే ప్రతి విమర్శను ఆచితూచి చేయాలి. అలా కాదు మాకు ఈ తాత్కాలిక ఆనందమే ముఖ్యం అనుకుంటే తెలుగుదేశం పార్టీ చవిచూసిన ఫలితాల్ని ఎన్నికల్లో రుచి చూడవలసి వస్తుంది
