మైకందుకుంటే యతి ప్రాసలతో, వేమన శతకాలతో, ప్రత్యర్ధులపై విమర్శల కురిపించే వైకాపా నేతల్లో.. అంబటి రాంబాబు ఒకరు. ముఖ్యంగా అసెంబ్లీలో అచ్చెన్నాయుడి పైనా, బయట పవన్ కల్యాణ్ పైనా అంబటి విమర్శలు పీక్స్ కి చేరుకుంటుంటాయి. ఈ క్రమంలో… పవన్ పోలవరం వెళ్తారని చెబుతూ.. ప్రభుత్వంపై పోలవరం పేరుచెప్పి నాందెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.
చంద్రబాబు నిర్దేశం మేరకే పవన్ ఢిల్లీ టూరు అని మొదలుపెట్టిన మంత్రి అంబటి… జనసేన పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా పోలవరంపై నాదెండ్ల వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన… నాదేండ్ల అజ్ఞానంతో మాట్లాడుతున్నారని.. అవాకులు, చవాకులు పేలుతున్నారని.. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదన్న విషయాన్ని సీఎం జగన్ ఇప్పటికే అసెంబ్లీలో స్పష్టం చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు అస్తవ్యస్తం చేసిన సంగతి నాందెండ్లకు తెలియదా అని ప్రశ్నించిన ఆయన… జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకోవటమే పెద్దతప్పు అని తెలిపారు.
అనంతరం నాదేండ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన అంబటి… నాదెండ్ల మనోహర్ కి బ్రోకరిజం చేయటం తప్ప మరేం తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్, చంద్రబాబుకు మధ్య ప్యాకేజీలు కుదర్చడం తప్ప నాదెండ్లకు మరేం తెలీదని… పోలవరం గురించి తెలుసుకోవాలంటే… తనను అడిగితే వివరంగా చెబుతానని తెలిపారు. నాదెండ్ల మనోహర్ కి చంద్రబాబు నుంచి పవన్ కి డబ్బులు ఎలా ఇప్పించాలో మాత్రమే తెలుసు కానీ… పోలవరం, నిర్వాసితులు, భూసేకరణకు మొత్తం కేంద్రమే చెల్లించాలన్న విషయం తెలియదని దుయ్యబట్టారు.
“చంద్రబాబుకు డబ్బులు కాజేయాలనే చిత్తశుద్ది. పవన్ కి ప్యాకేజీ కొట్టేయాలనే చిత్తశుద్ధి. కేవలం మాకు మాత్రమే పోలవరాన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి” అంటూ… అంబటి ఫినిషింగ్ ఇచ్చారు.
కాగా… ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్.. పోలవరంపై జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసి వచ్చారు. ఏపీ ప్రభుత్వం సరిగా పనులు చేయడంలేదని హస్తిన కేంద్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా పోలవరం ప్రాజెక్టును స్వయంగా సందర్శించడానికి వెళ్లబోతున్నారని తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపైనే స్పందించిన అంబటి… గొడవ చేయడానికే జనసేన నేతలు పోలవరం వెళ్తే ఎలా ఊరుకుంటామని హెచ్చరించారు!

