శ్రీ‌వారి గ‌డ్డం కింద ప‌చ్చ‌క‌ర్పూరం ఎందుకు పెడ‌తారో తెలుసా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పుణ్య‌క్షేత్రాల్లో అతిపెద్ద పుణ్య‌క్షేత్రంగా పేరుగాంచింది తిరుప‌తి. చిత్తూరు జిల్లాలో తిరుప‌తి ప‌ట్ట‌ణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది. ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు రోజూ కొన్ని ల‌క్ష‌ల్లో వ‌స్తూ ఉంటారు. కాలిన‌డ‌క‌న వ‌చ్చి శ్రీ‌వారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గోవిందా గోవిందా అంటూ ఈ తిరుప‌తిని ప‌విత్ర క్షేత్రంగా చేశారు. ఏడుకొండ‌ల మీద వెల‌సిన శ్రీ‌వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా త‌క్కువ‌నే చెప్పాలి. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు ఎందుకంటే ప్ర‌తిదానికి ఏదో ఒక కారణం ఖ‌చ్చితంగా ఉంటుంది. ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిట‌న్న‌ది ఇక్క‌డ తెలుసుకుందాం.

అనంతాళ్వారు శ్రీ‌వారి భ‌క్తుల‌లోనే అగ్ర‌గ‌ణులు. నిత్యం ఆయ‌న త‌న సేవ‌ల‌తో శ్రీ‌వారిని పూజిస్తూ ఉంటారు. ఇత‌డు కొండ పైన వెన‌క భాగంలో ఉండేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకున్నారు. పూలతోటను పెంచాలని నిర్ణయం త‌ర్వాత‌ పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయానికి వ‌చ్చారు. దాంతో చెరువును త‌వ్వడం మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య గ‌ర్భ‌వ‌తి. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు ఒక‌ బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అత‌ను ఒప్పుకోడు నిరాక‌రిస్తాడు. కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.

అది గ‌మ‌నించి అనంతాళ్వారులు భార్య‌ని ప్ర‌శ్నించ‌గా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అత‌నికి ప‌ట్ట‌లేనంత కోపం వ‌స్తుంది. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి తిరిగి వారికి కనబడకుండా మాయం అయిపోతాడు.

ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారు కు చెప్తారు. దాంతో కంగారు కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాల పై పడి క‌న్నీరు మున్నీరు అవుతాడు. గాయం త‌గిలింద‌నే బాధ‌తో ఆ నొప్పి తెలియ‌కుండా ఆయ‌న గ‌డ్డం వ‌ద్ద ప‌చ్చ‌క‌ర్పూరం పెడ‌తాడు. అప్పటినుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. ఇలాంటి ఎన్నో ఆచారాలు చాలా మందికి తెలియ‌వు. నేటి పిల్ల‌లకు అస్స‌లు తెలియ‌వు. మ‌న పురాణాలు సంస్కృతిల గురించి పెద్ద‌వారు పిల్ల‌ల‌కు చెబుతూ ఉండాలి.