ప్రియుడి అనుమానంతో ప్రియురాలి ఆత్మహత్య

జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇచ్చిన యువకుడు ప్రియురాలిపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరో యువకుడితో చనువుగా ఉంటోందని వేధించసాగాడు. అక్కడితో ఆగకుండా చేయి కూడా చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన బాధితురాలు, తన ప్రాణాన్ని తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

బోరబండ శాంతినగర్ లో వాణి అనే యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన కన్నం భరత్ తో వాణికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత ఆరేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. తన అన్న పెళ్లి కాగానే పెళ్లి చేసుకుందామని వాణిని భరత్ నమ్మించాడు. ఈ విషయం ఇంట్లో వారికి కూడా తెలియడంతో అంతా చూసి చూడనట్టు ఉంటున్నారు. అయితే గత మూడు నెలలుగా మరో యువకుడితో వాణి చనువుగా ఉంటోందని భరత్ అనుమానించడం మొదలుపెట్టాడు.

ఈ నెల 5 న వాణి ఇంటికి వచ్చిన భరత్ బలవంతంగా బైక్ పై తీసుకొని బయటికి వెళ్లాడు. అప్పటికే ఫుల్ గా మందు తాగి ఉన్నాడు. అర్దరాత్రి పూట మళ్లీ వాణి ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నావ్? వాడు ఎవడు? అంటూ తీవ్రంగా వేధించాడు. దీంతో బాధితురాలు తీవ్ర ఆవేదనకు లోనయింది. మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

వారిద్దరి మధ్య గొడవ జరిగినప్పడు వాణి తండ్రి సదానంద్ ఇంట్లోనే నిద్ర పోతున్నాడు. కాగా, ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.