అనుమానంతో భార్యను చంపిన భర్త

తొమ్మిది సంవత్సరాల క్రితం వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు అన్యోన్యంగా జీవించేవారు. వారి కాపురానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇంతలోనే భర్తకు భార్య పై అనుమానం వచ్చింది. ఆమెను నిత్యం వేధిస్తూ ఇబ్బంది పెట్టేవాడు. పిల్లల కోసం కుటుంబం కోసం ఆ ఇల్లాలు అన్నింటిని తట్టుకుంటూ వచ్చింది. కానీ ఆ భర్త చివరకు భార్య ప్రాణాలను తీసి పిల్లలను అనాథలను చేశాడు.    పూర్తి వివరాలు ఏంటంటే…

సరూర్ నగర్ పరిధి భగత్ సింగ్ నగర్ లో నివసించే రాము ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు. అదే కాలనీకి చెందిన శ్వేత ను తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కొంత కాలం వరకు బాగానే ఉన్న రాము గత రెండు సంవత్సరాల క్రితం నుంచి మద్యానికి అలవాటయ్యాడు. కుటుంబం గడవడం కష్టంగా ఉండడంతో శ్వేత ఇంటి పరిధిలోనే చిన్న కిరాణం షాపు నడుపుతోంది. దీంతో శ్వేత అందరితో మాట్లాడుతుందని రాము ఆమెను వేధించసాగాడు. ఆమె పై అనుమానంతో నిత్యం నరకం చూపించేవాడని స్థానికులు తెలిపారు. తాగి వచ్చి కొట్టేవాడన్నారు.

సోమవారం రాత్రి ఫుల్ గా మందు తాగి వచ్చిన రాము శ్వేతతో గొడవపడ్డాడు. ఆమె గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పైసలు తీసుకొని పరారయ్యాడు. మంగళవారం ఉదయం పక్క ఇంట్లో ఉండే తోటి కోడలు వచ్చి శ్వేతను పిలవగా లేవలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులందరిని పిలిచింది. వారు వచ్చి చూడగా శ్వేత అప్పటికే చనిపోయి ఉంది.

కోడలిని చంపిన కొడుకును ఉరి తీయాలని రాము తల్లి పోలీసులను కోరింది. తన కోడలు బంగారమని తన కొడుకు తాగి వచ్చి కొట్టిన పిల్లల కోసం, కుటుంబం పరువు కోసం భరించిందని అంత మంచి కోడలిని చంపిన నా కొడుకును ఉరితీయాలని ఆమె రోధించింది. తల్లి హత్యకు గురి కావడం, తండ్రి పరారు కావడంతో ముగ్గురు చిన్నారులు ఏం తెలియక అమాయకంగా కూర్చున్నారు.  శ్వేత తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.