పిల్లలను ఓ రూంలో వేసి మరో రూంలో తల్లిని…

జీవనోపాధి కోసం భర్త ఆటో నడిపేందుకు వెళ్లగా ఆమె పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటోంది. ఒంటరిగా ఉన్న ఆమెపై కామాంధులు తెగబడ్డారు. నలుగురు పిల్లలను ఒక గదిలో బంధించి దారుణంగా లైంగిక దాడి చేశారు. ఒకరు బెదిరిస్తూ ఉండగా మరో ఇద్దరు సమాజం తలదించుకునేలా అత్యాచారం చేశారు.  బంధువులే రాబందులుగా మారి కొనసాగించిన ఈ దుస్యాసన పర్వం నగర శివారులోని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి  జరిగింది. 

జల్‌పల్లి వాదే ముస్తఫా బస్తీకి హర్యానా నుంచి షాకీర్‌ ఖాన్‌ కుటుంబం ఇటీవలే వలస వచ్చి నివాసం ఉంటుంది. షాఖీర్‌ఖాన్‌  ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా….అతని భార్య (25) నలుగురు పిల్లలతో కలిసి ఇంటి వద్దే ఉంటుంది.

వీరికి దగ్గరలోనే సమీప బంధువులు కూడా నివాసం ఉంటున్నారు. భర్త ఉదయం ఆటోకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన బంధువులు ఆజాద్, అంజాద్‌లతో పాటు వారి స్నేహితుడు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి మంచినీరు అడిగారు. తెలిసిన వారే కావడంతో ఆమె ఇంట్లోకి వెళ్లి నీరు తెచ్చేంతలోపే బంధించారు. నలుగురు పిల్లలను మూడో వ్యక్తి పక్క గదిలో ఉంచి ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ బెదిరించి కాపలగా ఉన్నాడు.

మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. విధులు ముగించుకొని అర్ధరాత్రి వచ్చిన భర్తకు ఆమె జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. దీంతో అతడు  పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.