హైదరాబాద్ లో దారుణం.. 16 ఏళ్ల అమ్మాయి పై 11 మంది గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలిక పై 11 మంది కామాంధులు అత్యాచారం చేశారు. కామాటిపురలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లకిడికిడిలో ఓ కుటుంబం నివసిస్తోంది. వీరు కూలి పని చేసుకొని బతుకుతారు. నాలుగు సంవత్సరాల క్రితం 12 ఏళ్ల బాలిక పై ఓ కామాంధుడు కన్నేసి బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దానిని సెల్ ఫోన్ లో రికార్డు చేసుకొని పలుమార్లు బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనితో పాటు అతని స్నేహితులు ఒక్కొక్కరుగా నాలుగేళ్ల కాలంలో 11 మంది బాలిక పై అత్యాచారం జరిపారు. ప్రస్తుతం బాలిక వయసు 16 సంవత్సరాలు.

బాలికకు కాస్త తెలివి తక్కువ ఉండడం, అందరికి వీడియో చూపిస్తామనడంతో బాలిక భయంతో ఎవరికి ఈ విషయం చెప్పలేదు. బాలికకు గర్భం రాకుండా పలు జాగ్రత్తలు తీసుకొని వీరు అత్యాచారానికి పాల్పడ్డట్టు తేలింది.

అయితే గత రెండు రోజుల క్రితం ఏకంగా 11 మంది ఓకే సారి బాలిక పై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిని అంతా సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఆ తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ల పరీక్షలలో బాలిక పై గత నాలుగు సంవత్సరాలుగా అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో బాలికను కుటుంబ సభ్యులు అడగగా అసలు విషయం తెలిపింది.

విషయం తెలుసుకున్న బస్తీ వాసులు ఆగ్రహంతో కామాటిపుర స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ ను చుట్టిముట్టి ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. మరో ఆరుగురి కోసం సెర్చ్ చేస్తున్నారు. ఆలస్యంగా బయటికి వచ్చిన ఈ వార్త హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. 200 మంది బస్తీవాసులు స్టేషన్ దగ్గర నుంచి కదలకుండా ఆందోళన చేస్తుండడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. నిందితులను పట్టుకొని వారికి ఉరి శిక్ష వేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.