అఫీషియల్ :“మల్లేశం” రిలీజ్ డేట్ ఫిక్స్ !

చేనేత కార్మికుడు ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌ ‘చింత‌కింది మ‌ల్లేశం’ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మ‌ల్లేశం’. ఈ బ‌యోపిక్‌లో కమెడియన్ ప్రియ‌ద‌ర్శి మ‌ల్లేశం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్త‌ి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాను జూన్ 21న విడుద‌ల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది.


నేత కార్మికురాలిగా తన తల్లి పడుతున్న కష్టాన్ని చిన్నప్పటి నుండి చూసిన మల్లేశం, తన తల్లి లాగా ఇంకెవ్వరూ కష్టపడకూడదని ఓ యంత్రాన్ని కనుగొని, నేత కార్మికుల కష్టాన్ని తగ్గించాడు. ఆ యంత్రానికి తన తల్లి పేరుమీదుగానే లక్ష్మీ ఆసుయత్రం అని పేరు పెట్టారు. ఆయనే చింతకింది మల్లేశం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట అనే మారుమూల గ్రామీణ చేనేత కార్మికుడు. ఈయన కథతో తెరకెక్కుతున్న చిత్రమే.. ‘మల్లేశం’.

మామూలుగా ఆసు పోయడంతో ఒక చీర నేయడానికి 5నుంచి 6గంటలు పడుతుంది. అదే ఆసు యంత్రంతో గంటన్నరలో ఒక చీర నేయవచ్చు.మల్లేశం చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది కూడా. కాగా ఈ సినిమాలో ప్రియదర్శికి జోడిగా అనన్య నటిస్తుండగా, శ్రీ అధికార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.