‘మహర్షి’:75 కోట్లు లెక్కల్లో తేడా వస్తోందే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోందంటున్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం కేవలం 18 రోజుల్లో రూ.175 కోట్లు (గ్రాస్‌) రాబట్టిందని చిత్రం టీమ్ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది.

‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ సినిమాల తర్వాత రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన మహేష్ మూడో సినిమా ఇదేనంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ హీరోకు రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన మూడు సినిమాలు ఉన్న ఘనత దక్కలేదని సంబర పడిపోతున్నారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ …ట్రేడ్ లో మాత్రం రివర్స్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా బిజినెస్ దాదాపు క్లోజ్ అయ్యినట్లే అంటున్నారు. వంద కోట్లురాబట్టడమే కష్టం అని అంటున్నారు. అటు చూస్తే నిర్మాతలు 175 కోట్లు అంటూంటే ఇటు ట్రేడ్ లో వంద కోట్లు అనటం ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరి మద్యా 75 కోట్ల వ్యత్యాసం ఉంది. దాంతో ఇవి ఫేక్ ఫిగర్సా అనే సందేహం సైతం వస్తోంది.

రైతులు, వ్యవసాయం నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో ‘వీకెండ్‌ వ్యవసాయం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అయ్యింది.

‘మహర్షి’లో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర పోషించారు. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రశంసలు లభించాయి. ఓ మంచి మెసేజ్ ఇచ్చారని అందరూ మెచ్చుకున్నారు.