బెదిరింపులు, ప్రధాని సాయం కోరిన మాజీ హీరో భార్య

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ప్రస్తుతం తన ఆస్తి వివాదం కారణంగా చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దిలీప్ కుమార్‌కు చెందిన బంగళాలోని రెండు ఫ్లాట్లపై యాజమాన్య హక్కుపై కోర్టుకెక్కిన బిల్డర్ సమీర్ భోజ్వానీ ఈ మధ్యనే జైలు నుంచి విడుదలయ్యాడు. ఇది జరిగిన వెంటనే దిలీప్ కుమార్ భార్య సైరాభాను…ప్రధాని మోదీ ఈ విషయంలో సాయం చేయాలని కోరుతూ ఉత్తరం రాశారు.

ఆమె దిలీప్ కుమార్ ట్విట్టర్ ఖాతాలో తన సమస్యను వివరిస్తూ ‘మాఫియా సమీర్ భోజ్వానీ జైలు నుంచి విడుదలయ్యాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు విన్నివించుకున్నా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పద్మ విభూషన్ పురస్కార గ్రహీత దిలీప్ కుమార్‌కు బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

మరో ప్రక్క ఈ విషయమై సైరాభాను పోలీసులకు భోజ్వానీపై ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలోనే ముంబై పోలీసుశాఖ కూడా ఈ బిల్డర్‌ను ఆర్థిక నేరస్థునిగా గుర్తించి కేసు నమోదు చేసింది. అనంతరం భోజ్వానీని ఈఓడబ్ల్యు ఈ ఏడాది ఏప్రిల్‌లో జైలుకు తరలించింది.