స్టార్ హీరోయిన్ పై పోలీస్ కేసు, ఇదేం పని అని తిట్టిపోస్తున్నారు

రజనీకాంత్ తో ‘లింగా’సినిమాలో హీరోయిన్ గా చేసిన సోనాక్షీ సిన్హా గుర్తుండే ఉండి ఉంటుంది. ఇప్పుడామె ఓ పోలీస్ కేసులో ఇరుక్కుంది. అదీ ఛీటింగ్ కేసు కావటంతో బాలీవుడ్ మీడియా మొత్తం ఈ విషయం హైలెట్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. సోనాక్షీసిన్హా, ఆమె మేనేజర్‌తో పాటు మరో ఐదుగురు మోసానికి పాల్పడ్డారంటూ ఇండియన్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డుల కంపెనీ ఆమెపై డిల్లీలో కేసు పెట్టింది. ఢిల్లీలో షో నిర్వహించేందుకు సదరు కంపెనీ సోనాక్షీ సిన్హా బ్యాంకు ఖాతాలో రూ. 28 లక్షలు జమచేసినట్టు చెబుతోంది. విమానం టిక్కెట్ కూడా రిజర్వ్ చేయించామని, అయినా వారు అనుకున్న సమయానికి పోగ్రామ్ చేసేందుకు నిరాకరించారని ఆరోపిస్తోంది.

అంతేకాదు ఆ తర్వాత ఎలాగో పోగ్రామ్ జరగలేదని… డబ్బు తిరిగి ఇమ్మంటే..అందుకు కూడా ఇష్టపడటం లేదని కంపెనీ చెబుతోంది. పైగా డబ్బులు అడిగినందుకు సోనాక్షీ మేనేజర్ తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయంలో తమకు న్యాయంచేయాలని కోరుతూ కంపెనీ యజమాని ప్రమోద్ శర్మ పోలీసులు ఆశ్రయించారు. ఈ విషయమై సోనాక్షీ సిన్హా ఇంకా స్పందించలేదు.